ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టువీడకపోవడంతో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ తమ దేశానికి రావాలని పాకిస్థాన్ కోరుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్కు ఎట్టిపరిస్థితుల్లో తమ జట్టును పంపమని బీసీసీఐ ఐసీసీకి తేల్చేసి చెప్పింది.
ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 100 రోజుల కౌంట్డౌన్ ఈవెంట్ను కూడా ఐసీసీ రద్దు చేసింది. ఇప్పటికే ఈ మెగాటోర్నీ అధికారిక షెడ్యూల్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ డ్రాఫ్ట్ షెడ్యూల్ మాత్రమే ఖరారైంది.దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు ఐసీసీ చర్యలు వేగవంతం చేసింది. పాకిస్థాన్కు టీమిండియా రాదని బీసీసీఐ స్పష్టం చేసిందని.. పీసీబీకి అధికారికంగా మెయిల్ చేసింది.

కాగా, ఈ మెయిల్ను పీసీబీ తమ ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడేం చేయమంటారని సలహా కోరింది. ''తమ జట్టును పాకిస్థాన్కు పంపించిదని బీసీసీఐ పేర్కొందని ఐసీసీ.. పీసీబీకి మెయిల్ చేసింది. దీనిలో ఎలాంటి కారణం చెప్పలేదు. మరోవైపు బీసీసీఐ నుంచి మాకు ఎలాంటి మెయిల్ రాలేదు. అయితే ఈ పరిస్థితిని పీసీబీ ప్రభుత్వానికి తెలియజేసింది. సలహా కోరింది'' అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించవద్దని పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ భావిస్తున్నాడు. టీమిండియాను తమ దేశానికి రప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. నఖ్వీ మంత్రి కూడా కావడంతో ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించుకున్నాడు. ఐసీసీ నుంచి అంతిమంగా తమకు ప్రతికూల నిర్ణయం వస్తే.. వచ్చే ఏడాది భారత్లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్కు తమ జట్టును పంపించకూడదని పాకిస్థాన్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు. ఇటీవల పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్లో శ్రీలంక వేదికగా మ్యాచ్లు ఆడింది.