ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ టోర్నీని నిర్వహించాల్సి ఉంది. కానీ పాక్కు ఎట్టిపరిస్థితుల్లో టీమిండియను పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడం, మరోవైపు హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పుకోకపోవడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు. ఇటీవల పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్లో శ్రీలంక వేదికగా మ్యాచ్లు ఆడింది.అదే తరహాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లు కూడా ఇతర దేశాల్లో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీతో చెప్పింది.

అయితే తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ గురించి స్పందిస్తూ.. తమ దేశానికి టీమిండియా రాకపోతే, భవిష్యత్లో భారత్ వేదికగా జరిగే మెగాటోర్నీలకు తమ జట్టును పంపించమని పేర్కొన్నాడు. మరో ఆరేళ్లలో భారత్ అయిదు మెగాటోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, మెన్స్ ఆసియా కప్నకు; 2026లో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ20 వరల్డ్ కప్కు; 2029లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ; 2031లో బంగ్లాదేశ్తో కలిసి వన్డే వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యంఇవ్వనుంది.
''పాకిస్థాన్కు టీమిండియాను పంపించడానికి అంగీకరించకపోతే, భారత్లో జరిగే ఈవెంట్స్లోనూ పాకిస్థాన్ జట్టు ఆడదు. అసమానతను మేం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం. ఐసీసీ సమావేశంలో ఏం జరిగినా.. మా ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలను తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను. ఇక డిసెంబర్లో జై షా ఐసీసీ బాధ్యతలు అందుకోనున్నాడు. బీసీసీఐ నుంచి ఐసీసీకి మారిన తర్వాత అతను ఐసీసీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాడని భావిస్తున్నాను. ఆ పదవిని స్వీకరించిన ఎవరైనా సరే, సంస్థ సంక్షేమం గురించే ఆలోచించాలి'' అని మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు.