మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆసీస్ కెప్టెన్ కమిన్స్ గాయపడటం ఆసీస్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అసలు అతడు ఈ మెగా టోర్నీలో ఉంటాడా? లేదా? అని అభిమానులు కంగారు పడ్డారు. తాజాగా ఆ అనుమానాలను తెరదించుతూ అతడి నేతృత్వంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. దీంతో ఆసీస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ప్యాట్ కమిన్స్ చాలా రోజులుగా చీలమండ సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ తర్వాత అడిడికి ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో శ్రీలంకతో జరిగబోయే టెస్టు సిరీస్కు అతడికి రెస్ట్ ఇచ్చారు. అలానే ఈ నెల చివర్లో కమిన్స్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది.

దీంతో అతడి స్థానంలో శ్రీలంక సిరీస్కు స్టీవ్ స్మిత్ను కెప్టెన్ గా తీసుకున్నారు. అలా వ్యక్తిగత కారణాలతో శ్రీలంక టూర్కు ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. కానీ ఇప్పుడు అతడి నేతృత్వంలోని ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగబోతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
ఇకపోతే, గాయం కారణంగా టీమిండియాతో జరిగిన సిరీస్లో కేవలం రెండు టెస్టులే ఆడిన జోష్ హేజిల్వుడ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా స్క్వాడ్
కమిన్స్ (కెప్టెన్), నాథన్ ఎలిస్, అలెక్స్ కేరీ, జోష్ హేజెల్వుడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, మ్యాట్ షార్ట్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, మార్కస్ స్టాయినిస్.
షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్; గ్రూప్-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
న్యూజిలాండ్ జట్టు ఇదే
న్యూజిలాండ్ జట్టును కూడా ప్రకటించారు. మార్క్ చాప్మన్, డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బెన్ సీర్స్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, టామ్ లేథమ్, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, మిచెల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డారిల్ మిచెల్, విల్ ఓరౌర్కీ.