Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు మొదట న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా.. ఆ తర్వాత టీమిండియా చేతిలో కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 29 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు ఓటమికి ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కోచ్ కూడా జట్టు ప్రదర్శనపై కీలక ప్రకటన చేశాడు.
పాక్ కోచ్ ఏమన్నాడంటే?
పాకిస్థాన్ కోచ్ ఆకిబ్ జావేద్ జట్టు పేలవ ప్రదర్శనకు సాకులు చెప్పారు. తమ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరని.. అందుకే తమ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిందని అన్నారు. పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు అది క్రికెట్ చాలా ఎక్కువ అని.. ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుందన్నారు. భారత జట్టు చాలా అనుభవజ్ఞులను కలిగి ఉందని గణాంకాలు చెబుతున్నాయని.. ఆ ఆటగాళ్లు సమిష్టిగా 1500 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడారని ఆకిబ్ జావేద్ పేర్కొన్నారు. పాక్ జట్టులోని ఆటగాళ్లు కేవలం 400 మ్యాచ్ లు మాత్రమే సమిష్టిగా ఆడారని చెప్పుకొచ్చారు.

బాబర్ అత్యంత అనుభవజ్ఞుడు అని.. 100కి పైగా మ్యాచ్ లు ఆడాడని.. అతని తర్వాత మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రీది ఉన్నారని చెప్పారు. మిగిలినవారంతా 30 కంటే తక్కువ మ్యాచ్ లే ఆడారన్నారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగిటప్పుడు అనుభవం ముఖ్యమన్నారు. అనుభవం లేకపోవడం వల్లే మ్యాచ్ లో ఓటమి పాలయ్యాం.. అనండంలో సందేహమే లేదన్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన వారు ఉన్నారని.. తాము ఆశించిన విధంగా రాణించలేదన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ప్రయాణం గురించి చెప్పాలంటే.. పాక్ మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కొంది. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ ను 60 పరుగుల తేడాతో ఓడించింది. తర్వాతి మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. నేడు(ఫిబ్రవరి 27) తన చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంది.