ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత తొలగింది. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైబ్రిడ్ మోడల్లోనే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. పాకిస్థాన్కు ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడం, మరోవైపు హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుబట్టడంతో.. గత కొంత కాలంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే.
కానీ శనివారం జరిగిన సమావేశంలో ఐసీసీ చేసిన ఒత్తిడికి పాకిస్థాన్ దారికొచ్చింది. హైబ్రిడ్ మోడల్ను అంగీకరించకపోతే పాక్ లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని ఐసీసీ స్పష్టం చేయడంతో.. వేరే దారిలేక పాక్ బోర్డు తలవంచింది. అయితే ఐసీసీ ముందు రెండు షరతులు ఉంచింది. హైబ్రిడ్ మోడల్తో తమ ఆదాయానికి గండి పడుతుందని, కాబట్టి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూను పెంచాలని తెలిపింది.

2031 వరకు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ను కూడా హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇండియాకు తమ జట్టును పంపించమని పరోక్షంగా పేర్కొంది. ఈ రెండింటిని అంగీకరించాలని ఐసీసీ కోరింది. 2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు.
ఇటీవల పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్లో శ్రీలంక వేదికగా మ్యాచ్లు ఆడింది.కాగా, మరో ఆరేళ్లలో భారత్ అయిదు మెగాటోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, మెన్స్ ఆసియా కప్నకు; 2026లో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ20 వరల్డ్ కప్కు; 2029లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ; 2031లో బంగ్లాదేశ్తో కలిసి వన్డే వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యంఇవ్వనుంది. ఈ టోర్నీలను కూడా హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని పాక్ డిమాండ్ చేస్తోంది. అయితే పాక్ షరతులు గురించి ఐసీసీ ఆలోచిస్తోంది.