టీమిండియాలోకి మళ్లీ తనకు చోటు దక్కుతుందని ఆశతో ఉన్నట్లు చెప్పాడు సీనియర్ క్రికెట్ కరుణ్ నాయర్. జట్టులో తనకు అవకాశం వస్తే కచ్చితంగా రాణిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
''దేశం కోసం ఆడాలనేది నా కల. అది ఇప్పటికే సాధించేశాను. ఇప్పటికీ ఆ కల సజీవంగానే ఉంది. అందుకే, నేనింకా క్రికెట్ ఆడుతున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే, ఇది నా మూడో పునరాగమనం అని భావిస్తాను. ఆ అవకాశం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. నేనెప్పుడు క్రీజ్లోకి అడుగుపెట్టినా అదే నా చివరి అవకాశం అనుకుని ఆడతాను. ఇప్పటివరకు ప్రతి మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ముందుకు సాగాను. నాణ్యమైన క్రికెట్ ఆడటం వరకే నేను చేయగలను. మిగతావి నా చేతిలో లేని విషయాలు. ఇప్పటికీ ఎంపిక అవుతాననే నమ్మకం నాకు ఉంది.

గతంతో పోలిస్తే ఇప్పుడేమీ నేను ప్రత్యేకంగా ఆడట్లేదు. అందులో ఎలాంటి రహస్యమేమి లేదు. ఎన్నో ఏళ్లుగా చేస్తోన్న కృషికి ఇప్పుడు ఫలితం దక్కిందనిపిస్తోంది. ప్రతిరోజును ఓ కొత్త సవాల్గా భావించి ఆడాను. ఇప్పుడు నాకు ఛాన్స్ వస్తుందో లేదో అని నేను భయపడటం లేదని చెబితే అది అబద్ధం అవుతుంది. ప్రతి ఆటగాడికి ఈ ఫీలింగ్ ఉంటుంది.
ఒకవేళ నాకు ఛాన్స్ రాకపోయినా, నా కెరీర్ ముగిసిపోయిందని భావించను. ఎక్కడ ఏం జరిగిందనే విషయమై ఆలోచిస్తాను. మళ్లీ నేనేం చేయాలనే విషయంపై దృష్టి సారిస్తాను. సున్నా నుంచే మొదలు పెట్టాలని, మరికొన్నేళ్ల పాటు కష్టపడాలని భావిస్తాను. అదే నా ఆలోచనా విధానం. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా దాన్ని వదులుకోను'' అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.
కాగా, కరుణ్ నాయర్ రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా సెంచరీల మోత మోగించాడు. ఏడు మ్యాచుల్లో 750కిపైగా పరుగులు చేశాడు. దీంతో అతడిని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం, ఇంగ్లాండ్ సిరీస్ కోసం ప్రకటించబోయే జట్టులో అతడిని తీసుకోవాలని అంతా అంటున్నారు.