ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్థాన్ లోని కరాచి, లాహోర్, రావల్పిండి ఇంకా రెడీ కాలేదంటూ ఆ మధ్య విమర్శలు బాగా వచ్చాయి. ఐసీసీ కూడా ఈ విషయమై పాక్ క్రికెట్ బోర్డుకు డెడ్ లైన్ విధించి, గుర్రుగా ఉన్నట్లు వార్తలు కనిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూడు స్టేడియాలకు సంబంధించిన రెనోవేషన్ పనులు ఎక్కడి దాకా వచ్చాయో వివరాలు బయటకు వచ్చాయి.
ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే టోర్నీ ప్రారంభం కానున్న సమయానికి స్టేడియాలు అందుబాటులోకి వస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కరాచి జాతీయ స్టేడియం జనరల్ మేనేజర్ అర్షద్ ఖాన్ చెప్పారు. త్వరలోనే స్టేడియాలను పీసీబీకి అప్పగిస్తామని అర్షద్ ఖాన్ తెలిపారు. కరాచి, లాహోర్ స్టేడియాలు ఫిబ్రవరి 5 నాటికి పూర్తిగా సిద్ధమైతాయని పేర్కొన్నారు.

ఖర్చు ఎంతంటే
కరాచి, లాహోర్, రావల్పిండి స్టేడియాల రెనోవేషన్ కోసం పీసీబీ రూ.370 కోట్లకు పైనే ఖర్చు చేస్తోందని సమాచారం. ముఖ్యంగా లాహోర్లోని గడాఫీ స్టేడియం కోసం కాస్త ఎక్కువే ఖర్చు చేస్తున్నారట. మైదానంలో కొత్త ఫోల్డింగ్ సీట్లు, డిజిటల్ స్కోరు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారట. అలానే ఐసీసీ అవినీతి నిరోధక శాఖ, ఫిజియో, సహా ఇతర మ్యాచ్ కు సంబంధించిన అధికారుల కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారట.