ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి జట్టును అనౌన్స్ చేశారు. అయితే వెన్ను నొప్పితో సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయని పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు కూడా చోటు కల్పించారు. కానీ ఓ షరతు పెట్టారు.
బుమ్రాకు ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు వన్డేలకు విశ్రాంతి కల్పించారు. ఆ లోగా పూర్తి ఫిట్ నెస్ ను సాధిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఆడిస్తారు. ఈ విషయాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ తెలిపారు. కాగా, ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు కల్పించారు.

"బుమ్రాకు ఐదు వారాల పాటు సమయం ఇచ్చాం. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కారణంగా అతడు ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడు. అతడు ఫిట్ నెస్ అప్డేట్ గురించి ఎదురు చూస్తాం. ఫిబ్రవరి ప్రారంభంలో మెడికల్ టీమ్ ద్వారా అతడి ఫిట్ నెస్ ను మరోసారి పరిశీలిస్తాం. అప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటాం" అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ సిరీస్ కోసం తాజాగా 15 మందితో కూడిన టీమ్ను వెల్లడించింది బీసీసీఐ. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులో ఏమైనా మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 11 వరకు అవకాశం ఉంది.
టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్