ఛాంపియన్స్ ట్రోఫీకి మరి కొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే ఏడు జట్లు తమ స్క్వాడ్లను కూడా ప్రకటించేశాయి. టీమిండియా కూడా రీసెంట్ గానే అనౌన్స్ చేసింది. కానీ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తోన్న పాకిస్థాన్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. పైగా ఇప్పటికే ఐసీసీ విధించిన గడువు
కూడా ముగిసింది.
దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఎందుకు ఇంకా జట్టును ప్రకటించలేదని ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ క్రమంలోనే స్క్వాడ్ను ప్రకటించకపోవడంపై పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశాడు. "పాకిస్థాన్ జట్టు భయపడిందా ఏంటి, ఇంతవరకు స్క్వాడ్ ను ప్రకటించలేదు. అలా అయి ఉండదులే. భయ పడలేదని అనుకుంటున్నాను. కానీ,ఎందుకు ఆలస్యమయిందో? తెలియట్లేదు. నాకు తెలిసి సైమ్ ఆయుబ్ ఫిట్నెస్ విషయం వల్ల ఆలస్యమై ఉంటుంది.

పాకిస్థాన్ కు మిడిల్ ఆర్డర్ సమస్య ఉంది. అందుకే వాళ్లు టాప్ ఆర్డర్ ను బలంగా తయారు చేయాలనుకుంటున్నారు. పైగా భారత్లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. 140 కి.మీ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాలి. అదే అయుబ్ అందుబాటులో లేకపోతే వారిని ఎదుర్కోవడం కష్టమే. మరి సెలక్టర్లు ఏం చేస్తారో" అని బసిత్ అలీ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో టీమిండియాతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ ఉన్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. ఫిబ్రవరి 19న కరాచిలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ ప్రారంభం అవుతుంది. ఫైనల్ ను లాహోర్ వేదికగా మార్చి 9న నిర్వహిస్తారు. ఒకవేళ టీమిండియా ఫైనల్ చేరితే మాత్రం.. తుది పోరును దుబాయ్లో నిర్వహిస్తారు.