Champions Trophy 2025: భారత జట్టు తన తొలి మ్యాచ్లోనే విజయం సాధించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ను అద్భుతంగా ప్రారంభించింది. గ్రూప్ ఏలో ఉన్న భారత జట్టు తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. వారు భారత జట్టు బౌలింగ్ ను ఎదుర్కోలేక 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు స్టార్ బౌలర్ షమీ తన అద్భుతమైన బౌలింగ్ తో 5 వికెట్లను పడగొట్టాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 46.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. భారత ఆటగాడు శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీ(101) సాధించాడు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా ఒక మ్యాచ్ ఆడి 0.408 నికర రన్ రేట్తో రెండు పాయింట్లను కలిగి ఉంది.

అగ్రస్థానంలో న్యూజిలాండ్
గ్రూప్ ఏలో న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను 60 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో న్యూజిలాండ్ కూడా రెండు పాయింట్లు, +1.2 నికర రన్ రేట్ను పొందింది. అత్యధిక నికర రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ భారత్ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.బంగ్లాదేశ్, పాకిస్తాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒక్కొక్క మ్యాచ్లో ఆ రెండు జట్లు ఓడిపోయాయి.పాకిస్తాన్ నికర రన్ రేట్ -1.2, ఇది చాలా పేలవంగా ఉంది.

ఆ మ్యాచ్ గెలిస్తే.. భారత్ సెమీ ఫైనల్ స్థానం ఖాయం
రాబోయే మ్యాచ్లు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా 23వ తేదీన గ్రూప్ ఏలో పాకిస్థాన్, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు గెలిస్తే సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే, వారి సెమీఫైనల్ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారతాయి. బంగ్లాదేశ్ జట్టు విషయానికొస్తే.. వారి నెట్ రన్ రేట్ పాకిస్థాన్ కంటే కొంచెం ఎక్కువ. ఆ జట్టు న్యూజిలాండ్, పాకిస్థాన్ లతో తదుపరి మ్యాచ్ లను ఆడనుంది. ఆ రెండు మ్యాచ్ ల్లోనూ బంగ్లాదేశ్ గెలిస్తేనే సెమీఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. అది చాలా కష్టమైన విషయమే.