Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్ జట్టు బలమైన ఇంగ్లాండ్ టీమ్ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బీ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ట్రోఫీలో ఆఫ్ఘన్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కు ఇంకా సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రూప్-బీలో సెమీ ఫైనల్ కు చేరుకునేందుకు మూడు జట్ల మధ్య పోటీ ఉంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ లు సెమీస్ కు అర్హత సాధించగా.. గ్రూప్-బీ లో ఇంకా నిర్ణయించబడలేదు.
మూడు జట్ల మధ్య చిక్కుముడి
గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ జట్టు సున్నా పాయింట్లతో అట్టడుగున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్ లలో ఒక మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికతో మూడో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నికర రన్ రేట్ -0.990గా ఉంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఆఫ్ఘనిస్తాన్ కంటే పైన ఉన్నాయి. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు నికర రన్ రేట్ ప్రస్తుతం +2.140. దక్షిణాఫ్రికా తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా 3 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ +0.475. కానీ ఈ జట్లలో ఏవీ ఇంకా సెమీ-ఫైనల్ చేరుకోకపోవడం గమనార్హం.

సెమీ-ఫైనల్స్ సమీకరణాలు ఇవే..
గ్రూప్-బీలో మిగిలిన మ్యాచ్ ల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్ కు చేరుతారు. అనంతరం మార్చి 1న గ్రూప్-బీలో చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే.. దక్షిణాఫ్రికా సెమీఫైనల్ కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో కూడా గెలవాలి. మరోవైపు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై గెలిస్తే.. దక్షిణాఫ్రికా ఆడకుండానే సెమీఫైనల్ కు చేరుకుంటుంది.