ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య మధ్య తొలి సెమీ ఫైనల్ పోరు కోసం రంగం సిద్ధమైంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ముందుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పైగా రెండు బలమైన జట్లే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసీస్ - భారత్ మధ్య ఎన్ని మ్యాచ్లు జరిగాయి? ఎవరెన్ని సార్లు గెలిచారు? అప్పుడు మ్యాచ్ విన్నర్లుగా ఎవరు నిలిచారు? అసలు వన్డే క్రికెట్ లో ఇరు జట్ల మధ్య ఎన్నిసార్లు మ్యాచ్ జరగగా.. ఫలితాలు ఎలా వచ్చాయి? గణాంకాలను తెలుసుకుందాం.
వన్డే క్రికెట్ లో హెడ్ టు హెడ్
భారత్ - ఆసీస్ వన్డే క్రికెట్ లో మొత్తం 151 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా, 84 సార్లు ఆసీస్ గెలుపొందింది. 10 మ్యాచులు ఫలితం దక్కలేదు. ఇందులో భారత్ స్వదేశీ గడ్డపై 33 విజయాలను అందుకోగా.. ఆసీస్ 34 సార్లు అందుకుంది. బయట భారత్ 14 సార్లు గెలుపొందగా.. ఆసీస్ 34 సార్లు గెలిచింది. తటస్థ వేదికలపై భారత్ 10సార్లు, ఆసీస్ 12సార్లు గెలిచింది.

సచిన్ బ్యాట్తో పాటు బంతితోనూ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - ఆసీస్ మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 28, 1998న జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో సచిన్ తెందుల్కర్ బ్యాట్ తో (141; 128 బంతుల్లో) పాటు బంతితోనూ అదరగొట్టాడు. 9.1 ఓవర్లలో 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
యూవీ ధనాధన్..
2000 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆసీస్ పై టీమిండియానే విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో 20 పరుగుల తేడాతో గెలిచి నాకౌట్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ (84) అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు.
India vs Australia in Champions Trophy over the years
— Sportstar (@sportstarweb) March 3, 2025
1998: India won by 44 runs
2000: India won by 20 runs
2006: Australia won by 6 wickets
2009: No result
2025: ? pic.twitter.com/n2LzuWKMLw
ఆసీస్ విజయం..
అనంతరం 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్- ఎలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ (65), రాహుల్ ద్రవిడ్ (52) హాఫ్ సెంచరీలు చేయగా.. ఆసీస్ తరఫున డామియన్ మార్టిన్ (73), రికీ పాంటింగ్ (58), షేన్ వాట్సన్ (50) అర్ధ శతకాలు బాదారు.
A fresh pitch set to be used for the India Vs Australia Semi Final in Dubai. (Cricbuzz). pic.twitter.com/uoqO5sg7B8
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 3, 2025
మ్యాచ్ రద్దు..
2009 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - ఆసీస్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడడంతో ఫలితం రాలేదు. మ్యాచ్ ను రద్దు చేశారు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు భారత్ ఆసీస్ మొత్తంగా నాలుగు మ్యాచుల్లో తలపడగా.. అందులో రెండు సార్లు భారత్ గెలిచింది. ఆసీస్ ఒక్కసారి విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ రద్దైంది.