Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో టీమిండియా తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 228 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత జట్టు 47 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. లక్ష్య ఛేదనలో శుభ్మన్ గిల్ తన అద్భుతమైన సెంచరీతో టీమిండియాకు విజయాన్ని అందించాడు. గ్రూప్-ఏలో రెండు మ్యాచ్ లు జరగడంతో ఈ గ్రూప్ లో సెమీ-ఫైనల్స్ సమీకరణాలు రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి.
టీమిండియా విజయం.. ప్రస్తుతం ఇలా..
ఈ విజయంతో టీమిండియా రెండు ముఖ్యమైన పాయింట్లను సాధించింది. బంగ్లాదేశ్ జట్టుకు ఏమీ లభించలేదు. గ్రూప్-ఏలో న్యూజిలాండ్ తర్వాత టీమిండియా ఇప్పుడు రెండో స్థానంలో ఉంది.న్యూజిలాండ్ జట్టు మొదటి మ్యాట్ లో పాకిస్థాన్ ను 60 పరుగుల తేడాతో ఓడించింది. వారి నికర రన్ రేట్ +1.200 కాగా.. +0.408 రన్ రేట్ తో టీమిండియా రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ జట్టు మూడో స్థానంలో ఉండగా.. ఆతిథ్య పాకిస్థాన్ జట్టు అట్టడుగున ఉంది.

మరోసారి ఓటమిపాలైతే ఇంటికే..
ఈ రెండు మ్యాచ్ ల తర్వాత గ్రూప్-ఏలో న్యూజిలాండ్, భారత్ చెరో 2 పాయింట్లు సాధించగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్టు ఏమీ సాధించలేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల రన్ రేట్ కూడా అంతగా బాగాలేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు మరోసారి ఓడిపోతే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా పాకిస్థాన్ సెమీ ఫైనల్స్ చేరుకోవడం కష్టంగా అనిపిస్తోంది. ఫిబ్రవరి 23న జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ భారత్ తో తలపడనుంది.
భారత్-న్యూజిలాండ్ జట్లు ఓడిపోవాలి..
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ చేరుకోవాలంటే పాకిస్థాన్ చాలా బలమైన భారత జట్టును ఓడించాలి. బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్ ను ఓడించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోతే అది సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఫిబ్రవరి 23న జరిగే భారత్-పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా ఉంది. ఏదేమైనా న్యూజిలాండ్, భారత జట్లు ప్రస్తుతం గ్రూప్ -ఏలో సెమీ-ఫైనల్ కు చేరుకోవడానికి అతిపెద్ద పోటీదారులుగా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాయింట్ల విధానం ఇలా..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రతి విజయానికి రెండు పాయింట్లు ఇవ్వబడతాయి. గ్రూప్ దశలో మ్యాచ్ టై అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ తర్వాత జట్లు సమాన పాయింట్లు సాధిస్తే.. నికర రన్ రేట్ ఆధారంగా జట్లు సెమీ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.