ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీకి గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడి.. ఈ టోర్నీకి దూరమయ్యారు. దీంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం..
కెప్టెన్ తో పాటు మరో ముగ్గురు..
గాయాల వల్ల ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన వారిలో ఎక్కువ మంది ఆస్ట్రేలియా నుంచి ఉన్నవారే. ఏకంగా నలుగురు ఆటగాళ్లు మెగాటోర్నీకి మిస్ అయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు గాయమవ్వడం వల్ల అతడి స్థానంలో స్టీవ్ స్మిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఇదే పరిస్థితి. మార్కస్ స్టాయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. పేసర్ జోష్ హేజిల్వుడ్ కూడా గాయంతోనే మెగా టోర్నీకి అందుబాటులో ఉండట్లేదు. మొత్తంగా నలుగురు కీలక ప్లేయర్లు మిస్ అవ్వడంతో ఆస్ట్రేలియా పరిస్థితి దారుణంగా తయారైంది.

మూడు సెంచరీల యువ సంచలనం మిస్..
ప్రస్తుతం పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తలకు బంతి బలంగా తాకింది. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇప్పుడతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. పేసర్ లాకీ ఫెర్గూసన్కు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి డౌటే. దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోకియా వెన్ను నొప్పి కారణంగా వైదొలిగాడు. ఆడిన 9 వన్డేల్లోని మూడు శతకాలు బాదిన పాకిస్థాన్ యువ సంచలనం సయీమ్ ఆయుబ్ చీలమండ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. నిజానికి అతడు కోలుకుని తిరిగొస్తాడి పాక్ భావించింది. కానీ అది జరగలేదు.
బుమ్రా ఔట్..
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా లేడా అన్న ఉత్కంఠతకు తాజాగా తెరపడింది. అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించలేదని తెలుపుతూ.. సెలక్షన్ కమిటీ హర్షిత్ రాణాను తీసుకుంది. అతడు కోలుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి విశ్రాంతినివ్వడమే మేలని తెలిపింది. షమీ రీసెంట్ గానే సర్జరీ చేయించుకుని బరిలోకి దిగాడు. అతడి ఫామ్ ప్రస్తుతానికి పర్వాలేదనిపిస్తోంది. మరి అతడ ఎలా ఆడతాడో.. కోహ్లీ ఇటీవలే మోకాలి వాపు కారణంగా ఇంగ్లాండ్ తో తొలి వన్డేకు దూరమయ్యాడు. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ గాయం తిరగబెడితే చెప్పలేం. ఏదేమైనా బుమ్రా దూరమవ్వడం భారత్ కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
అతడు కూడా అనుమానమే
ఇంగ్లాండ్ యంగ్ ఆల్రౌండర్ జాకబ్ బెతెల్.. టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో తొడకండరాల నొప్పి కారణంగా ఆడలేదు. తొలి వన్డేలో మంచిగా రాణించిన అతడు.. రెండో వన్డేలోనూ అదే ప్రదర్శన చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు గాయం అవ్వడం వల్ల.. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడటం అనుమానంగా మారింది.