ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కొత్త వివాదం మొదలైంది. బీసీసీఐ వైఖరితోనే ఈ వివాదం చోటు చేసుకుందని, బీసీసీఐ వైఖరి క్రికెట్ గేమ్ కు మంచిది కాదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆరోపించింది. కాగా, ఈ వివాదం పీసిబీ, బీసీసీఐ మధ్య మళ్లీ ఉద్రిక్తతకు దారీ తిసింది.
అసలేం జరిగిందంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పాక్ పేరు ఉండాలి. కానీ బీసీసీఐ తాజాగా రిలీజే చేసిన టీమిండియా జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు లేదని తెలుస్తోంది.

దీంతో పీసీబీ మరోసారి బీసీసీఐ వైఖరిపై మండిపడింది. బోర్డు తీరు బాగోలేదంటూ విమర్శించింది. ఓ పీసీసీ అధికారి మాట్లాడుతూ.. "క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడం సరికాదు. ఇది క్రికెట్ కు మంచిది కాదు. మొదట భారత జట్టును పాకిస్థాన్ కు పంపడానికి తిరస్కరించారు. ఇప్పడేమో ప్రారంభ వేడుకల కోసం తమ కెప్టెన్(రోహిత్ శర్మ)ను పంపించట్లేదు. ఇక తమ జెర్సీపై కూడా ఆతిథ్యం ఇస్తోన్న పాకిస్థాన్ పేరు ఉండకుండా చేస్తున్నారని తెలిసింది. ఇది బాధాకరం. ఈ విషయంపై ఐసీసీ పాకిస్థాన్ కు సపోర్ట్ గా ఉంటుందని భావిస్తున్నాను" అని అన్నారు.
2008 ముంబయి ఉగ్రదాడుల తర్వాత భారత్ - పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగట్లేదు. చివరగా ఇరుజట్ల మధ్య 2013 జనవరిలో వన్డే, టీ20 సిరీస్ లు జరిగాయి. ఆ తర్వాత నుంచి ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. భారత్ లో పర్యటించేందుకు పాకిస్థాన్ ఆసక్తిగానే ఉన్నా, బీసీసీఐ మాత్రం వారిని పక్కనపెడుతోంది. అలానే పాకిస్థాన్ కు తమ జట్టును పంపించట్లేదు.
ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కూడా పాకిస్థాన్ కు పంపట్లేదు. దీనిపై చాలా రోజుల పీసీబీ-బీసీసీఐ-ఐసీసీ మధ్య పెద్ద చర్చే సాగింది. చివరికి ఈ విషయంలో పాకిస్థాన్ తగ్గడం వల్ల భారతే నెగ్గింది. ట్రోఫీని హైబ్రిల్ మోడల్ లో నిర్వహించేలా చేసింది. ఈ వివాదం ముగిసి కొద్ది రోజులు కూడా కాలేదు అంతలోనే ఇప్పుడు 'జెర్సీ' గొడవ మొదలైంది.