వార్మప్ మ్యాచ్: సత్తా చాటిన బౌలర్లు, కివీస్పై భారత్ విజయం
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. అసలు పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రదర్శన చేసింది. పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3/28), మహ్మద్ షమి (3/47) విజృంభించడంతో ఆదివారం భారత్ తన తొలి సన్నాహక మ్యాచ్లో సత్తా చాటింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డక్వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వర్ష ప్రభావిత మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. రోంచి (63 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్ (47 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకున్నారు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (9) వద్ద పెవిలియన్కు చేరాడు. ఆరంభంలోనే వికెట్ పడ్డా మరో ఓపెనర్ లుక్ రోంచి మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8), పాండ్యా బౌలింగ్లో రెండు బౌండ్రీలతో ఆకట్టుకున్నాడు. బుమ్రా ఓవర్లో క్లిష్టమైన క్యాచ్ను అశ్విన్ వదిలేయడంతో రోంచి ఊపిరిపీల్చుకున్నాడు.
ఆ తర్వాత షమి బౌలింగ్లో వరుసగా 4, 4, 6తో విజృంభించాడు. కానీ, అదే ఓవర్లో వరుస బంతుల్లో కేన్, నీల్ బ్రూమ్(0)లను షమీ పెవలియన్కు చేర్చాడు. దీంతో 63 పరుగులకే న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది.
భువీ బౌలింగ్లో సింగిల్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోంచి నెమ్మదించాడు. అదే ఓవర్లో కోరె అండర్సన్ (13)ను భువీ స్ట్రయిట్ బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, పాండ్యా బౌలింగ్లో సిక్సర్తో మళ్లీ వేగం పెంచిన రోంచి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. అయితే జడేజా అతణ్ణి బౌల్డ్ చేశాడు.

పీకల్లోతు కష్టాల్లో కివీస్
జడేజా తర్వాతి ఓవర్లోనే క్రీజు ముందుకొచ్చి కొలిన్ గ్రాండ్హోమ్ (4) స్టంపౌటవడంతో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసపటికే మిచెల్ శాంట్నర్ (12)ను అశ్విన్ పెవిలియన్ చేర్చడంతో 126/7తో నిలిచిన కివీస్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనిపించింది. కానీ చివర్లో నీషమ్ చక్కగా రాణించాడు. వచ్చీరాగానే అశ్విన్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను టెయిలెండర్ల సహకారంతో జట్టు స్కోరు 150 దాటించాడు. కాగా.. ఉమేష్ చక్కటి షార్ట్ బాల్తో ఆడమ్ మిల్నే (9)ను అవుట్ చేయగా.. ఆ వెంటనే టిమ్ సౌథీ (4)ని భువీ తొమ్మిదో వికెట్గా పెవిలియన్ చేర్చాడు.

ఆఖరి వికెట్గా ట్రెంట్ బౌల్ట్
భువీ వేసిన 39వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ (9) ఆఖరి వికెట్గా వెనుదిరగగా.. నీషమ్ మాత్రం నాటౌట్గా నిలిచాడు. భువనేశ్వర్, మహమ్మద్ షమీ మూడేసి వికెట్లు తీయగా... జడేజాకు రెండు వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ కీలకంగా నిలిచారు. రెండో ఓవర్లోనే క్యాచ్ అవుటయ్యే ప్రమాదం నుంచి ధావన్ తప్పించుకోగా ఐదో ఓవర్లో రహానే (7) రూపంలో జట్టు తొలి వికెట్ను కోల్పోయింది. హుక్ షాట్కు ప్రయత్నించిన రహానే స్క్వేర్ లాంగ్ లెగ్లో బౌల్ట్కు దొరికిపోయాడు.

నిలకడగా కోహ్లి, ధావన్ జోడి
ఆ తర్వాత కోహ్లి, ధావన్ జోడి నిలకడగా ఆడుతూ అండగా నిలిచింది. వీరిద్దరి ఆటలో దూకుడు లేకపోయినా అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచారు.అయితే అర్ధసెంచరీ వైపు పయనిస్తున్న ధావన్ను 19వ ఓవర్లో నీషమ్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవర్ వ్యవధిలోనే దినేశ్ కార్తీక్ కూడా డకౌట్గా వెనుదిరిగాడు. అటు సరిగ్గా 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లికి ధోని (21 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడవ్వడంతో స్కోరులో కాస్త వేగం పెరిగింది.

26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు
ఈ క్రమంలో 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది. టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్ నెగ్గినట్టు ప్రకటించారు. చూడచక్కని షాట్లతో అలరించిన విరాట్ కోహ్లి (55 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, శిఖర్ ధావన్ (59 బంతుల్లో 40; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనారోగ్యం వల్ల యువరాజ్, సోదరి వివాహం కారణంగా ఆలస్యంగా ఇక్కడికి చేరుకున్న రోహిత్ శర్మ తొలి వార్మప్ మ్యాచ్ ఆడలేదు. ఇక మంగళవారం జరిగే రెండో వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications