
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వస్తున్న వార్తలపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. క్రీడలు అత్యుత్తమైనవి అన్న ఆయన.. వ్యక్తుల కంటే ఆటే గొప్పది అని చెప్పుకొచ్చారు. ఆటకంటే ఎవరూ గొప్ప కాదు అని అన్నారు. దేశంలోని ఏ క్రీడలో ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందనే సమాచారం తాను ఇవ్వలేనని ఆయన చెప్పారు. ఆ విషయాలు అన్నీ సంబంధిత ఫెడరేషన్స్, అసోసిషేయన్స్ చూసుకుంటున్నాయని తెలిపారు. వాళ్తు ఏమైనా చెబితేనే తనకు తెలుస్తుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒక వేళ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏమైనా విబేధాలు ఉంటే అది బీసీసీఐ చూసుకుంటుందని అనురాగ్ చెప్పారు. కాగా అనురాగ్ ఠాకూర్ గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన సంగతి తెలిసిందే.
అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొన్నాయని ఇటీవల జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యత అప్పగించినప్పటి నుంచే ఈ పుకార్లు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై అభిమానులతోపాటు పలువురు మాజీలు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పైవిధంగా స్పందించారు.
అసలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు ఎలా వచ్చాయంటే.. రోహిత్ శర్మ గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరం కావడం, అదే సమయంలో విరాట్ కోహ్లీ వన్డేలకు దూరం కానున్నాడనే వార్తలు రావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గతంలో కూడా మనస్పర్ధలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇద్దరు మళ్లీ కలిసిపోయారు. అయితే ఈ వివాదంపై నేడు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఈ వివాదం నడుమే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ నెల 16న భారత జట్టు సౌతాఫ్రికా బయలుదేరుతుంది. అక్కడ ఈ నెల 26 నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ కూడా ఆడుతుంది. సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన అనంతరం కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారత జట్టు క్వారంటైన్లో ఉండనుంది.