CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్ల్లో భాగంగా వైజాగ్లో జరిగిన పోరులో తెలుగు వారియర్స్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. భోజ్పురి దబాంగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో వైఫల్యం చెందడం వల్ల అఖిల్ సేన ఓటమిని మూటగట్టుకుంది.
టాస్ గెలిచిన తెలుగు వారియర్స్
మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. భోజ్పురి దబాంగ్స్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే తెలుగు జట్టుకు మంచి బ్రేక్ తగిలింది. భోజ్పురి కెప్టెన్ మనోజ్ తివారీ మొదటి బంతికే ఫోర్ కొట్టినా, రెండో బంతికే అఖిల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన అస్గర్ ఖాన్ చెలరేగి ఆడి 60 పరుగులు సాధించడంతో భోజ్పురి జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో భోజ్పురి జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తెలుగు బౌలర్లలో సచిన్ జోషి 2 వికెట్లు తీయగా, రఘు, సమ్రాట్, వినయ్ చెరో వికెట్ పడగొట్టారు.

తెలుగు వారియర్స్ లక్ష్య చేధన
156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ అఖిల్ అక్కినేని కేవలం 12 పరుగులకే వెనుదిరగగా.. మధ్యలో వచ్చిన ఆటగాళ్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. వినయ్ మహాదేవ్ (27), సుధీర్ బాబు (26) కొంతవరకు పోరాడినా, మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో తెలుగు జట్టు చివరకు 18.1 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భోజ్పురి దబాంగ్స్ 41 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఓటమికి గల కారణాలు
తెలుగు వారియర్స్ బ్యాటింగ్లో సమన్వయం లోపించడం, ముఖ్యంగా రనౌట్ల రూపంలో కీలక వికెట్లు కోల్పోవడం జట్టుపై ఒత్తిడి పెంచింది. భోజ్పురి బౌలర్లలో మనోజ్ తివారీ 3 వికెట్లతో సత్తా చాటగా.. రాజీవ్ రిషి 2 వికెట్లు తీశారు. దీనితో 41 పరుగుల భారీ తేడాతో భోజ్పురి దబాంగ్స్ ఘన విజయం సాధించింది. హోమ్ గ్రౌండ్లో (వైజాగ్లో) జరిగిన తొలి మ్యాచ్లోనే ఓటమి పాలవ్వడం తెలుగు అభిమానులను నిరాశకు గురిచేసింది.