మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు:
లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల దాటికి భారత టాప్ఆర్డర్ బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్ చేరారు. ఐదు పరుగులకే రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీలు ఔట్ అయ్యారు. ఈ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు కొద్దిసేపు పోరాడినా.. చెత్త షాట్లు ఆడి ఔట్ అయ్యారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6) అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. తనదైన స్థాయిల్లో బ్యాట్ జులిపించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
బ్యాటింగ్లోనే కాదు:
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1X6)తో కలిసి వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే చేయాల్సిన పరుగులు ఎక్కువవడంతో భారీ షాట్ ఆడబోయిన జడేజా.. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చేతికి చిక్కి నిరాశగా డగౌట్ చేరుకున్నాడు. అనంతరం ధోనీ రనౌట్ అవ్వడంతో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జడేజా బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్ కూడా అదరగొట్టాడు. తన కోటా 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
చివరి శ్వాస వరకు పోరాడతా:
తాజాగా జడేజా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'ప్రతి పతనం తర్వాత ఎలా పోరాడాలనేది క్రికెటే నాకు నేర్పింది. నాకు స్ఫూర్తి కలిగించిన అభిమానుల అందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్నది. నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నాకు స్ఫూర్తి కలిగిస్తూనే ఉండండి. నా చివరి శ్వాస వరకు పోరాడతా' అని జడేజా ట్వీటాడు. దీంతో జడేజాపై అభిమానులు మరిన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు.
తప్పని నిరూపించాడు:
గతంలో జడేజాపై విరుచుకుపడ్డ సంజయ్ మంజ్రేకర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... 'ఈ రోజు జడేజా తన ఆటతో నన్ను ముక్కలు ముక్కలు ( బిట్స్ అండ్ పీసెస్) చేసాడు. అద్భుత బ్యాటింగ్తో తన వ్యాఖ్యలు తప్పని నిరూపించాడు. గత 40 ఇన్నింగ్స్లలో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమే. గతంలో ఇలాంటి జడేజాను ఎప్పుడూ చూడలేదు. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఆకట్టుకున్నాడు' అని మంజ్రేకర్ అన్నాడు.