మీర్పూర్: బంగ్లాదేశ్ రెండో వన్డేలో ఓ క్యాచ్ కాంట్రోవర్సీకి దారి తీసింది. తాను పట్టిన క్యాచ్కు అవుట్ ఇవ్వక పోవడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తికి లోనయ్యాడు. షేర్ బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓడింది. తద్వారా సిరీస్ కూడా కోల్పోయింది.
అయితే, తాను పట్టిన క్యాచ్ సరైనదేనని, థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంపై కోహ్లీ అసంతృప్తికి గురయ్యాడు. తద్వారా ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ను అదృష్టం వరించిందని భావిస్తున్నారు.
ఈ మ్యాచ్లో భారత్ 45 ఓవర్లకు 200 పరుగులు చేసింది. భారత్ అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

200 పరుగులు ఛేదించే క్రమంలో (డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం) ధవల్ కులకర్ణి వేసిన రెండో ఓవర్ రెండో బంతిని బంగ్లా ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ కొట్టాడు. ఆ బంతిని కోహ్లీ పట్టుకున్నాడు. వెంటనే అవుట్ అనే ఉద్దేశ్యంతో సంతోషంగా ఎగిరి గంతేశాడు.
అయితే, స్థానిక ఎంపైర్ షర్ఫౌద్దైలా స్క్వేర్ లెగ్ ఎంపైర్ రాడ్ టక్కర్ను (ఆస్ట్రేలియా) కన్సల్ట్ చేశాడు. ఆన్ ఫీల్డ్ మ్యాచ్ అధికారులు టీవీ అంపైర్ అనిసుర్ రెహ్మాన్ను అడిగారు. దానిని నాటౌట్గా భావించారు. కోహ్లీ చేతుల్లో పడేకంటే ముందే అది బౌన్స్ అయినట్లుగా భావించారు.
పలుమార్లు రిప్లేలు చూశాక ఇక్బాల్ను ఆడించారు. దీనిపై కోహ్లీ, కులకర్ణిలు అప్ సెట్ అయ్యారు. కాగా, దీనిపై కోహ్లీ అంపైర్ను అడిగాడు. ఇదిలా ఉండగా, కులకర్ణి బౌలింగులోనే 7వ ఓవర్లో ఇక్బాల్ అవుట్ కావడం గమనార్హం. అతను 13 పరుగులు చేసి అవుటయ్యాడు.