టీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత జట్టులో కీలకమార్పులు సంభవించాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఓపెనర్గా వచ్చే రోహిత్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఓపెనర్ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడానికి యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఉన్నారు. కానీ రోహిత్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేది ఎవరనేదే అసలు ప్రశ్న.
ప్రస్తుతానికి టీ20లకు మాత్రమే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ వచ్చే ఏడాది జూన్లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం అన్ని ఫార్మాట్లకు హిట్మ్యాన్ వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కెప్టెన్ సిద్ధం చేసుకునే సమయం వచ్చేసింది. రో'హిట్' కెప్టెన్సీని కొనసాగించేలా వారసుడు ఉండాలి. గత కొన్నాళ్లుగా రోహిత్కు స్టాండ్బై కెప్టెన్గా హార్దిక్ పాండ్య ఉన్నాడు. కానీ అతనికే పూర్తి బాధ్యతలు అందిస్తారనే నమ్మకంతో చెప్పలేని పరిస్థితి.

గాయాలతో హార్దిక్ జట్టుకు ఎన్నో సందర్భాల్లో దూరమయ్యాడు. దీంతో ఈ ఆల్రౌండర్ మూడు ఫార్మాట్ల పనిభారాన్ని మోయగలడా అనేది అసలు ప్రశ్న? పనిభారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఓ ఫార్మాట్కు హార్దిక్ విశ్రాంతినిస్తూ, మిగిలిన ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు అందిస్తే.. అది స్ప్లిట్ కెప్టెన్సీనే అవుతుంది. ఇది భారత క్రికెట్పై ప్రతికూలత కూడా చూపే అవకాశం ఉంది. అయితే హార్దిక్నే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అని జైషా హింట్ ఇచ్చాడు.
హార్దిక్ ఫామ్పై కూడా ప్రశ్నలు వచ్చాయని, కానీ సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని టీ20 వరల్డ్ కప్లో అతను నిలబెట్టుకున్నాడని జై షా అన్నాడు. అయితే కెప్టెన్ ఎంపిక సెలక్టర్ల నిర్ణమని తెలిపాడు. ''కెప్టెన్సీ గురించి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. వాళ్లతో చర్చించిన తర్వాత కెప్టెన్ ఎవరనేది ప్రకటిస్తాం. మీరు హార్దిక్ గురించి అడుగుతున్నారు. అతని ఫామ్పై ఎన్నో సందేహాలు వచ్చాయి. కానీ సెలక్టర్లు అతనిపై నమక్మం ఉంచారు. హార్దిక్ నిరూపించుకున్నాడు'' అని జై షా పేర్కొన్నాడు. ముగ్గురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో ఇప్పటికే మార్పు మొదలైందని అన్నాడు.