విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ కెప్టెన్సీపై కొందరు విమర్శలు చేశారు. ధోనీ నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్న కోహ్లీ నాలుగేళ్లు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఈ బాధ్యతలు రోహిత్ శర్మకు దక్కాయి.
రోహిత్ లేని సమయంలో హార్దిక్ కూడా వైట్ బాల్ క్రికెట్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎప్పటి నుంచో తను రోహిత్కు చాలా మంచి ఫ్యాన్ అని అక్తర్ చెప్తున్న సంగతి తెలిసిందే.

రోహిత్ బ్యాటింగ్పై అక్తర్ చాలాసార్లు ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే రోహిత్ కెప్టెన్సీపై మాత్రం తాజాగా పెదవి విరిచాడు. మంచి ప్రెజర్ పరిస్థితి వచ్చినప్పుడు రోహిత్ ప్యానిక్ అయిపోతున్నాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో కోహ్లీ కన్నా రోహిత్ ట్యాలెంటెడ్ ప్లేయర్ అని, కానీ టీమిండియా కెప్టెన్సీ మాత్రం అతనికి సూట్ అవ్వలేదన తేల్చిచెప్పాడు.
'రోహిత్ చాలా మంచి వ్యక్తి. కానీ టీమిండియా కెప్టెన్సీ తను తీసుకొని ఉండాల్సింది కాదు. ఒత్తిడిలో రోహిత్ తడబడుతున్నాడు. విరాట్ కన్నా రోహిత్ ట్యాలెంటెడ్ అని చెప్తా. తన దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయి. కానీ కెప్టెన్సీ అతనికి సూట్ అయిందా? అని చాలాసార్లు ఆలోచిస్తుంటా. అయితే వరల్డ్ కప్లో సొంత ఫ్యాన్స్ మద్దతు ఉంటుంది. కాబట్టి ట్రోఫీ నెగ్గే సత్తా ఆ టీంకు ఉంది' అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ కెప్టెన అయిన తర్వాత కూడా టీమిండియా తలరాత పెద్దగా మారలేదు. గతేడాది ఆసియా కప్ కూడా గెలవలేకపోయిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు వెళ్లింది. అక్కడ ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా చేతిలో ఘోరమైన ఓటమి చవిచూసింది. ఇలాంటి సమయంలో వరల్డ్ కప్లో అతని కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.