హైదరాబాద్: ధర్మశాల వేదకిగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చివరి టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. గాయం కారణంగా ధర్మశాల టెస్టులో కోహ్లీ ఆడటం లేదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పష్టం చేశారు.

2011 నవంబర్ నుంచి 54 టెస్టుల తర్వాత కోహ్లీ లేకుండా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. దీంతో జట్టు బాధ్యతలను రహానేకి అప్పగించారు. భారత టెస్టు జట్టు తరపున కెప్టెన్సీ చేపట్టిన 33వ టెస్ట్ ప్లేయర్గా రహానే నిలిచాడు. కెప్టెన్ వేసుకునే బ్లేజర్ దుస్తుల్లో రహానే టాస్ వేసేందుకు స్టేడియంలోకి వచ్చాడు. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కోహ్లీ స్ధానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు.
ఇక పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో భువనేశ్వర్ కుమార్ చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, కెప్టెన్గా రహానేకు కూడా తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా మాత్రం రాంచీలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.
నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరిస్లో ఇరు జట్లు చెరో టెస్టుని గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. రాంచీ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్ విజేత ఎవరో తేల్చే టెస్టు కావడంతో ధర్మశాల టెస్టు నిర్ణయాత్మంగా మారింది. ఈ టెస్టులో గెలిచినవాళ్లకే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కైవసం కానున్నది.
కాగా, ధర్మశాల టెస్టుకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కోహ్లీ మాట్లాడాడు. వంద శాతం ఫిట్గా ఉంటేనే బరిలోకి దిగుతానని విరాట్ కోహ్లి స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇంకా చికిత్స తీసుకుంటున్నానని, ఆడతానో లేదో ఇప్పుడే ఏమీ చెప్పలేనని అతను అన్నాడు.
ప్రతి మ్యాచ్ తనకు ముఖ్యమైనదేనని, పూర్తి ఫిట్గా ఉంటేనే ఆడతానని తెలిపాడు. సిరీస్లో తాను ఇప్పటివరకు చేసిందేమీ లేదని, అయినా టీమ్ గెలిచిందని కోహ్లీ చెప్పాడు. క్లిష్ట సమయాలను ప్లేయర్స్ ఎదుర్కొన్న తీరు చూసి గర్వపడుతున్నానని, రాంచీలో పుజారా, సాహా అద్భుతంగా ఆడారని కోహ్లీ ప్రశంసించాడు.
ఇక విమర్శలు వస్తూనే ఉంటాయని, ఎవరు ఏమన్నా తాను పట్టించుకోనని, తన గురించి జట్టు సభ్యులు ఏమనుకుంటున్నారన్నదే తనకు ముఖ్యమని కోహ్లీ స్పష్టంచేశాడు. ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతున్నదని, బాగా ఆడినప్పుడు మెచ్చుకోవాల్సిందేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు.