హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజైన శనివారం అనుకోని సంఘటన చోటు చేసుకునేదే. కెప్టెన్ కోహ్లీ విసిరిన బంతి ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ లియాన్ డాసన్ తలను తాకేదే. అయితే ఈ ప్రమాదం నుంచి డాసన్ త్రుటిలో తప్పించుకున్నాడు.
స్టేడియంలో కోహ్లీ ఫీల్డింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన ఐదో టెస్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో డిసెంబర్ 16 (శుక్రవారం) ప్రారంభమైంది. రెండో రోజైన శనివారం అమిత్ మిశ్రా విసిరిన బంతిని ఆదిల్ రషీద్ స్వీప్ చేసి పరిగెత్తాడు.

రెండో రన్ తీయకుండా అడ్డుకుందామనుకున్న కోహ్లీ బంతిని అందుకుని వెంటనే వేగంగా విసిరాడు. ఈ క్రమంలో కీపర్ వైపు, అటు బౌలర్ వైపు చూడకుండా పరుగు తీస్తున్న డాసన్ తల వెనక నుంచి వెళ్లింది. దీంతో బిత్తరపోయిన డాసన్ ఆలా కోహ్లీ వైపే చూస్తుండిపోయాడు.
దీంతో వెంటనే కోహ్లీ సారీ అంటూ చేతితో సంజ్ఞ చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని అంఫైర్కు వివరించాడు. ఇదిలా ఉంటే చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 477 పరుగులకు ఆలౌట్ కాగా, డాసన్ 66 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 193 పరుగులు చేసింది.
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ని ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సరికి 20 ఓవర్లకు గాను 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లోకేశ్ రాహుల్ 30, పార్ధీవ్ పటేల్ 28 పరుగులతో ఉన్నారు.