పరువు కోసం ఆరాటం
3 మ్యాచ్ల వన్డే సిరీస్లో హాట్ ఫెవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా తొలి రెండు మ్యాచ్ల్లోనే ఓడి సిరీస్ను చేజార్జుకుంది. ఓడిన రెండు వన్డేల్లో భారత జట్టు సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో నేడు కేప్టౌన్ వేదికగా జరిగే చివరి మ్యాచ్లోనైనా గెలిచి సౌతాఫ్రికా గడ్డపై పరువు దక్కించుకోవాలని టీమిండియా ఆరాటపడుతోంది. ఒక వేళ ఈ మ్యాచ్లో కూడా ఓడితే వన్డే సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అవుతుంది. దీంతో ఆ ప్రమాదం నుంచి బయటపడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అందుకే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది.
జట్టులో మార్పులు
మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో యువ పేసర్ దీపక్ చాహర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్లు అశ్విన్, చాహల్లో ఒక్కరిని తప్పించి యువ స్పిన్నర్ జయంత్ యాదవ్కు జట్టులో స్థానం కల్పించవచ్చు. అలాగే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. బ్యాటింగ్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి రెండు వన్డే మ్యాచ్ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నారు.
కేప్టౌన్ రికార్డులు
ఇప్పటివరకు కేప్టౌన్ వేదికగా 5 వన్డే మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచింది. రెండు ఓడింది. అలాగే ఇక్కడ 37 వన్డే మ్యాచ్లు ఆడిన సౌతాఫ్రికా ఏకంగా 31 గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీస్తే టీమిండియా స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ 100 వికెట్ల క్లబ్లో చేరుతాడు. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేయక ఇప్పటికి 64 ఇన్నింగ్స్లు పూర్తయ్యాయి. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో చివరిదైన ఈ మ్యచ్లో కోహ్లీ సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్లీన్స్వీప్పై సఫారీలు గురి
ఇప్పటికే వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న సఫారీలు ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. దీంతో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన ఉత్సాహంతో కేప్టౌన్ వన్డేలో బరిలోకి దిగనుంది.
పిచ్
కేప్టౌన్ పిచ్ ఇటు బ్యాటర్లకు, అటు బౌలర్లకు సమానంగా అనుకూలించనుంది. పేసర్లకు మంచి పేస్ లభిస్తుంది. ఇక మరి అంత భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. 280 పరుగుల వరకు స్కోర్ నమోదవుతుంటుంది.
జట్లు (అంచనా)
భారత్:
రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, దీపక్ చాహర్, సిరాజ్, చాహల్.
దక్షిణాఫ్రికా:
డికాక్, యానెమన్ మలాన్, బవుమా (కెప్టెన్), మార్క్రమ్, డుస్సెన్, మిల్లర్, ఫెలుక్వాయో, కేశవ్, జాన్సెన్, మగలా, షంసీ.