భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఆదేశాలనను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఈ యువ ప్లేయర్ల పేర్లను తొలగించింది.
ఈ నేపథ్యంలో ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ భవిత్యవం ఏంటి? ఇక ఎప్పటికీ టీమిండియా జెర్సీ వాళ్లు ధరించలేరా? కాంట్రాక్ట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటనే సందేహాలు సగటు క్రికెట్ అభిమానికి వస్తున్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ఎంతో కీలకం. ఇది కోల్పోతే ఆర్థికంగా, ఆట పరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో వేతనం వస్తుంది. గరిష్టంగా ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు వస్తాయి.

ఇక ఆట పరంగా ఇషాన్, శ్రేయస్లకు ఇది కోలుకోలేని దెబ్బ. టీమిండియా ఎంపికలో సెలక్టర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు పెద్దపీట వేస్తారు. దీంతో ఈ యువ క్రికెటర్లు భారత జట్టులో తమ స్థానాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అయితే వాళ్లు తిరిగి దేశం తరఫున ఆడవచ్చు. టీమిండియాకు ఆడటానికి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు మాత్రమే అర్హులు అనే నిబంధన ఎక్కడా లేదు. కానీ జట్టులో తమ ప్రాధాన్యతను కోల్పోతారు.
ఇక ఇషాన్, శ్రేయస్ తిరిగి వెలుగులోకి రావాలంటే అత్యుత్తమ ప్రదర్శనలు చేయాలి. ఏడాదికి రెండు నెలల పాటు సాగే ఐపీఎల్లో వాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. కానీ మిగిలిన సమయంలో వాళ్లు ప్రజలను ఆకర్షించాలంటే.. సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇక చికిత్స తీసుకోవడానికి ఎన్సీఏ వెళ్లాలంటే రాష్ట్ర బోర్డుల ద్వారా అనుమతి తీసుకోవాలి.