హైదరాబాద్: స్వదేశంలో శ్రీలంకతో సిరిస్ ముగిసింది. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లితో పాటు ఢిల్లీ, ముంబైలో రిసెప్షన్లు కూడా ముగిశాయి. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం కూడా రానుంది. కొత్త సంవత్సరంలో కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా పర్యనటలో కొత్త ఛాలెంజ్ ఎదురుకానుంది.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. సుదీర్ఘ మైన ఈ సిరిస్ జనవరి 5న జరిగే కేప్ టౌన్ టెస్టుతో మొదలై ఫిబ్రవరి 24న జరిగే టీ20తో ముగుస్తుంది.

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా క్రికెటర్ క్రికెట్ లెజెండ్ నెలకొల్పిన రికార్డును కోహ్లీ బద్దలుకొడతాడా లేదా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు జనవరి 5న కేప్ టౌన్ వేదికగా ప్రారంభం కానుంది.
21 ఏళ్ల క్రితం కేప్టౌన్లో జరిగిన టెస్టులో సచిన్ టెండూల్కర్ 169 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత్ ఐదు సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పటికీ... కేప్టౌన్లో జరిగిన టెస్టులో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డు పరుగులను అధిగమించలేక పోవడం విశేషం.
దీంతో 21 ఏళ్ల క్రితం సచిన్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ అలానే ఉంది. ఈ ఏడాది కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో ఇదే ఫామ్ని విదేశీ గడ్డపై కొనసాగిస్తే సచిన్ రికార్డు బద్దలవ్వడం ఖాయమని క్రీడా విశ్లేషకులు సైతం అంటున్నారు. మరికొందరు అభిమానులు సచిన్ రికార్డుని బద్దలు కొట్టేది కోహ్లీ కాదు పుజారా అని అంటున్నారు.
దక్షిణాఫ్రికా సచిన్ మొత్తం 15 టెస్టులాడి ఐదు సెంచరీలు నమోదు చేశాడు. 1997లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించిన సమయంలో సచిన్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. జనవరి 2-6, 1997లో కేప్ టౌన్ వేదికగా జరిగిన టెస్టులో మహమ్మద్ అజారుద్దీన్ కూడా సెంచరీతో మెరిశాడు. అయితే సచిన్ కంటే తక్కువ పరుగులే చేయడం విశేషం.