భారీ లక్ష్యాన్ని అందుకోవడానికి పక్కా ప్లాన్ వేసుకున్నా..
భారత జట్టు నిర్దేశించి 336 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకోవడానికి పక్కా ప్రణాళిక, సమగ్ర వ్యూహంతో తాము ఇన్నింగ్ ఆరంభించామని అన్నారు. వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేయడంలో విఫలం అయ్యామని సర్ఫరాజ్ చెప్పారు. క్రీజులో పాతుకుని పోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తరువాతే భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నామని వివరించారు. ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్ దీన్ని అమలు చేశారని, ఆ తరువాతే పొరపాట్లు చోటు చేసుకున్నాయని చెప్పారు. తమపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం అసాధారణమని అన్నారు.
ఫఖర్, బాబర్ల తరువాత నిలవలేకపోయాం..
ఫఖర్ జమాన్, బాబమ్ ఆజర్లు నిష్క్రమించిన తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్లు ఒత్తిడిని ఎదుర్కోలేకపోయారని చెప్పారు. దురదృష్టశావత్తూ తమ వ్యూహాలను అమలు చేయలేకపోయామని అన్నారు. రన్రేట్ పెరిగిపోతుండటం వల్ల వెంట వెంటనే వికెట్లు కోల్పోవాల్సి వచ్చిందని సర్ఫరాజ్ చెప్పారు. సీనియర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ డకౌట్ కావడం జట్టుపై ప్రభావాన్ని చూపిందని అన్నారు. మూడు ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోవాల్సి రావడానికి ఒత్తిడే ప్రధాన కారణమని చెప్పారు. షోయబ్ మాలిక్, ఇతర సీనియర్ బ్యాట్స్మెన్లు సరిగ్గా ఆడకపోవడాన్ని తప్పు పట్టలేమని అన్నారు.
మూడు విభాగాల్లో విఫలం..
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో విఫలం కావడానికి ఏ ఒక్కరిపైనో వేలెత్తి చూపలేమని చెప్పారు. జట్టు మొత్తం ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. టాస్ గెలిచినప్పటికీ.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. పిచ్పై ఉన్న తేమే కారణమని చెప్పారు. పిచ్పై ఉన్న తేమను వినియోగించుకుని స్వింగ్ రాబట్టుకోవాలని తమ బౌలర్లు ప్రయత్నించారని, అది విఫలమైందని అన్నారు. ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయామని, ఫలితంగా ధారాళంగా పరుగులను ఇచ్చుకోవాల్సి వచ్చిందని సర్ఫరాజ్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఓటమి నుంచి త్వరగా కోలుకుని, మిగిలిన మ్యాచ్లల్లో తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శిస్తామని అన్నారు.