
కరాచీ: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కెరీర్పై ఎవరూ ఏమీ చేయలేం అని పాక్ చీఫ్ కోచ్, సెలక్టర్ మిస్బావుల్ హక్ అన్నాడు. ఇప్పటికైనా క్రమశిక్షణతో మెలిగితే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని మిస్బావుల్ తెలియజేశాడు. ఇక ఇప్పుడు అతని కెరీర్ అతని చేతుల్లోనే ఉందన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకి తెలియజేయలేదు. దీంతో అక్మల్ తన కెరీర్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు.
బుకీలతో సంప్రదింపుల విషయం వెలుగులోకి రావడంతో పీసీబీ అక్మల్పై గత ఫిబ్రవరిలో నిషేధం విధించింది. అక్మల్పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ అక్మల్ నుంచి సరైన వివరణ పీసీబీకి రాలేదు. దీంతో కోచ్, సెలక్టర్ మిస్బావుల్ హక్.. అక్మల్కు హెచ్చరికలు జారీ చేసాడు. తాజాగా మిస్బా ఓ మీడియాతో మాట్లాడుతూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసాడు.
'ఉమర్ అక్మల్ కెరీర్పై ఎవరూ ఏమీ చేయలేం. ఇప్పుడు కెరీర్ అతని చేతుల్లోనే ఉంది. క్రమశిక్షణ అలవర్చుకుని మళ్లీ ఆటపై దృష్టి సారిస్తే రీఎంట్రీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ నిర్ణయమైనా అతని చేతుల్లోనే ఉంది. ఒకవేళ అక్మల్ ఇదే తరహాలో ప్రవర్తిస్తే అతనిష్టం. ఇప్పటికే పాక్ తరఫున కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్లు అతను ఆడాడు కాబట్టి ఫిట్నెస్ మెరుగుపర్చుకుని.. క్రమశిక్షణ, అంకిత భావాన్ని అలవర్చుకుంటే రీఎంట్రీకి అవకాశం ఉంది' అని మిస్బా సూచించాడు.
గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్లో విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అక్మల్ పాకిస్థాన్ తరఫున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20 మ్యాచ్లు ఆడాడు.