SRH vs LSG: ఐపీఎల్ 2025 ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. 18వ సీజన్ లో ఇవాళ ఏడో మ్యాచ్ జరగబోతోంది. గురువారం రాత్రి 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం సన్రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై పరుగుల వరదను పారించింది. 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోరును సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో 300 స్కోరు దాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ లో 300 స్కోరు సాధించగల టీమ్ అంటే వినిపించే పేరు ఎస్ఆర్హెచ్. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొదటి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఈ సీజన్ లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లక్నో బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి నుంచి తేరుకుని లక్నో.. ఎస్ఆర్హెచ్ పై పోరాడేందుకు సిద్ధమవుతోంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న విధ్వంసకర బ్యాటర్లను ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు అసలైన సవాల్. అభిషేక్ నుంచి క్లాసెన్ వరకు ధుర్బేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్ రైజర్స్ కు ఫస్ట్ బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి కనిపిస్తోంది. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపా, అభిషేక్ శర్మలు ఉన్నారు.

ఢిల్లీ చేతిలో ఓటమి పాలైన లక్నో సూపర్ జెయింట్స్ కు సన్ రైజర్స్ తో మ్యాచ్ కఠిన పరీక్షే. సన్ రైజర్స్ లక్నో బౌలర్లను ఎంతవరకు ఆడుకుంటారన్నది చూడాలి. లక్నో బౌలింగ్ విభాగంలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ మినహా.. మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్ అంత పేరున్నబౌలర్లేం కాదు. లక్నో బౌలింగ్ లో బలహీనంగా ఉన్నా.. బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉంది. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, శార్ధూల్ ఠాకూర్ వరకు బ్యాటర్లు ఉండడం లక్నోకు కలిసొస్తుంది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ రిపోర్ట్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది సిక్స్లు, ఫోర్లు. ఐపీఎల్ చరిత్రలో నమోదైన మూడు అత్యధిక స్కోర్లలో రెండు ఈ మైదానంలోనే జరిగాయి. ఈ సీజన్లో ఇక్కడ ఆడిన తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులు చేసింది. సమాధానంగా రాజస్థాన్ కూడా 242 పరుగులు చేసింది. అభిమానులు మరోసారి హైదరాబాద్లో పరుగుల వర్షం చూస్తారు. హైదరాబాద్ బ్యాట్స్మెన్ల తుఫానును ఆపడం లక్నో బౌలర్లకు పెద్ద సవాలుగా ఉంటుంది.రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 78 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ కాలంలో జట్లు 21 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత సీజన్ నుండి ఇప్పటివరకు ఇక్కడ ఆడిన 7 మ్యాచ్లలో, 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు 9 సార్లు కనిపించింది. ఈ రికార్డు టీ20 ఇంటర్నేషనల్లో మరింత భయంకరమైనది. గత ఏడాది బంగ్లాదేశ్పై భారత్ 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం IPL రికార్డులు
మొత్తం మ్యాచ్లు- 78
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది- 35
జట్టు చేజింగ్ పరుగుల వేటలో గెలిచింది - 43
టాస్ గెలిచిన జట్టు గెలిచింది- 28
టాస్ ఓడిన జట్టు గెలిచింది- 50
అత్యధిక జట్టు స్కోరు - 286/6, SRH vs RR
అత్యల్ప జట్టు స్కోరు- 80/10, DC vs SRH
అత్యధిక వ్యక్తిగత స్కోరు - 126 పరుగులు, డేవిడ్ వార్నర్
ఉత్తమ బౌలింగ్ స్పెల్ - 6/12, అల్జారి జోసెఫ్
మొదట బ్యాటింగ్ చేసినప్పుడు సగటు స్కోరు- 162 పరుగులు
సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అంచనా
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్(కెప్టెన్, సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమి
లక్నో సూపర్ జెయింట్స్: మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.