క్రికెట్లో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే చాలు.. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్లలో పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టుకు ఫైనల్ వెళ్లే దారి చాలా కష్టంగా మారింది. ఈ ఓటమి పాక్ ఫైనల్ ఆశలను తగ్గించినప్పటికీ.. పూర్తిగా ముగిసిపోలేదు. పాకిస్తాన్ తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలంటే మిగిలిన మ్యాచ్లలో తప్పక విజయం సాధించాలి. పాకిస్తాన్ కు సూపర్-4లో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఆ రెండు మ్యాచ్లలో గెలిస్తే వారికి ఫైనల్ చేరుకునే అవకాశం ఉంటుంది.
పాకిస్తాన్ ఫైనల్కు వెళ్లాలంటే..
పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్లను తప్పక గెలవాలి. ఒక్క మ్యాచ్లో ఓడినా పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ కల చెదిరిపోతుంది. శ్రీలంక కూడా పాకిస్తాన్ లాంటి పరిస్థితిలోనే ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు సెప్టెంబర్ 25న పాకిస్తాన్తో తలపడినప్పుడు, ఆ మ్యాచ్ గెలిచి ఫైనల్లో స్థానం సంపాదించుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది.

ఫైనల్ టికెట్ ఇలా లభిస్తుంది..
ఆసియా కప్ సూపర్-4లో అన్ని జట్లు మూడు మూడు మ్యాచ్లు ఆడతాయి. ఈ మ్యాచ్ల తర్వాత సూపర్-4 పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్లకు రెండేసి పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఏదైనా ఒకటి మిగిలిన రెండు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటాయి.
పాకిస్తాన్ ఫైనల్ రావాలని కోరుకుంటున్న అభిమానులు
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరప్పా. ఈ జట్ల మధ్య మ్యాచ్ చూడడానికి జనాలంతా స్టేడియానికి తరలివస్తారు. పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచి ఫైనల్ కు రావాలని పాకిస్తాన్ అభిమానులతో పాటు భారత అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.
సెప్టెంబర్ 28న ఫైనల్
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. సూపర్ 4లో పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇప్పుడు భారత జట్టు సూపర్ 4లో తమ రెండు మ్యాచ్లు శ్రీలంక, బంగ్లాదేశ్తో ఆడనుంది. బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ సెప్టెంబర్ 24న, శ్రీలంకతో సెప్టెంబర్ 26న జరుగుతుంది.