
పాక్ సెమీస్ ఆశలే సజీవమేనా?
బంగ్లాదేశ్పై భారత్ గెలవడంతో పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. దీంతో ఆ జట్టు అభిమానులు భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ సెమీస్ చేరడం అసాధ్యమా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గణాంకాల పరంగా చూసుకుంటే పాకిస్తాన్కు ఇంకా సెమీస్ చేరే ఛాన్స్ కనబడుతోంది. అయితే ఈ అవకాశాలు నిలబడాలంటే ఈరోజు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్తోపాటు చివరగా బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచి మంచి నెట్ రన్ రేట్ సంపాదించాలి. ఆ తర్వాత మిగతా జట్లు అంటే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ల ఫలితాలపై ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

జింబాబ్వేనే కీ ఫ్యాక్టర్
ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ అవకాశాలు భారీగా దెబ్బ తినడానికి కారణం జింబాబ్వే. భారత్ చేతిలో చివరి బంతికి ఓడిన పాకిస్తాన్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో కూడా ఓటమి పాలైంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అత్యంత షాకింగ్ విజయం ఇదే అనడం అతిశయోక్తి కాదు. ఈ ఓటమితో బాబర్ ఆజమ్ సేనపై ఆ జట్టు అభిమానులతోపాటు మాజీలు కూడా నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఆ జట్టు సెమీస్ చేరాలంటే మళ్లీ జింబాబ్వేనే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రూప్లో చివరి మ్యాచ్లో భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గనుక మరో సంచలనం నమోదై, భారత్ ఓడితే.. నెట్ రన్ రేట్ దృష్ట్యా పాకిస్తాన్ ఈ గ్రూప్లో భారత్ కంటే మెరుగైన స్థితిలో నిలుస్తుంది. తద్వారా సెమీస్ చేరుతుంది.

మరో సెనారియో
లేదంటే గురువారం నాడు ప్రొటీస్పై పాకిస్తాన్ నెగ్గడంతోపాటు ఆ జట్టును నెదర్లాండ్స్ ఓడించాలి. నెదర్లాండ్స్ చేతిలో గనుక సఫారీలు ఓడితే.. పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. అందుకే బంగ్లాపై పాక్ భారీ విజయం నమోదు చేయాలి. నెదర్లాండ్స్ గెలిస్తే సౌతాఫ్రికా, పాకిస్తాన్ సమానమైన పాయింట్లతో నిలుస్తాయి. ఇలాంటి సమయంలో బంగ్లాపై భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ మెరుగు పరుచుకుంటే పాక్.. సెమీస్ చేరుతుంది. అప్పుడు భారత్, పాక్ ఈ గ్రూప్ నుంచి సెమీస్ వెళ్తాయి. ప్రస్తుతం ఉన్న జట్ల బలాబలాలు పరిశీలిస్తే సఫారీలను నెదర్లాండ్స్ ఓడించడం అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ లెక్క ప్రకారం పాక్ను సెమీస్ ఆశలు పూర్తిగా ఆవిరి కాలేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications












