
1996 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, వెస్టిండిస్ vs శ్రీలంక
1996లో వరల్డ్కప్కు భారత్, శ్రీలంక, పాకిస్థాన్ మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. దీంతో ఆయా దేశాల్లోని వేదికల్లో మ్యాచ్లు జరిగాయి. మెగా టోర్నీకి మూడు వారాల ముందు కొలంబోలో ఎల్టీటీఈ బాంబు దాడి చేసింది. ఈ ఘటనతో శ్రీలంకతో మ్యాచ్లు ఆడేందుకు కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. షెడ్యూల్ ప్రకారం నాలుగు మ్యాచ్లు లంకలో జరగాలి. జింబాబ్వే, కెన్యా దేశాలు మాత్రం ఆక్కడ తమ మ్యాచ్లను ఆడగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మాత్రం వాకోవర్ ఇచ్చాయి. దీంతో శ్రీలంక ఐదు విజయాలతో గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది. చివరికి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్కప్ను విజేతగా నిలిచింది.

2003 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ vs కెన్యా
2003 వరల్డ్కప్లోనూ సరిగ్గా ఇలానే జరిగింది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యాలు ఆతిథ్యచ్చాయి. గంగూలీ కెప్టెన్సీలో భారత్ ఫైనల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లు నిర్వహించే సమయంలో జింబాబ్వేలో రాజకీయ అనిశ్చితి తలెత్తింది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే వివాదాస్పదంగా అధికారం చేజిక్కించుకోవడంతో ప్రజా ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. దీంతో ఇంగ్లాండ్ అక్కడ మ్యాచ్లు ఆడలేమని తేల్చి చెప్పింది. మరోవైపు కెన్యాలో అంతర్యుద్ధం జరగడంతో న్యూజిలాండ్ తన మ్యాచ్ని రద్దు చేసుకుంది.

మ్యాచ్లను రద్దు చేసుకుంటే
ఐసీసీ వరల్డ్కప్ లాంటి టోర్నీల్లో మ్యాచ్లను రద్దు చేసుకుంటే ప్రత్యర్థికి జట్టుకు ఆయాచితంగా పాయింట్లు లభిస్తాయి. 1996లో శ్రీలంక ఇలాగే లబ్ధిపొందింది. అయితే, 2003 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మాత్రం నష్టపోయింది. జింబాబ్వే, ఇంగ్లాండ్ గ్రూప్ దశలో తలో మూడు మ్యాచ్లు నెగ్గి సమంగా నిలిచాయి. పాక్, జింబాబ్వే మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్త్రమించింది. మరోవైపు న్యూజిలాండ్ తప్పుకోవడంతో నాలుగు బోనస్ పాయింట్లు కలుపుకొని 14 పాయింట్లతో కెన్యా మూడో స్థానంలో నిలిచి సెమీస్ చేరింది.

పాక్తో భారత్ మ్యాచ్ ఆడకపోతే!
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్కప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అందరూ కోరుకుంటున్నారు. దీని వల్ల భారత్కు ఏ మేరకు నష్టం జరుగుతుందో చూద్దాం. ఈ ఏడాది వరల్డ్కప్ను ఐసీసీ రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తోంది. ఈ విధానం ప్రకారం టోర్నీలో పాల్గొంటోన్న ఒక జట్టు మిగతా అన్ని జట్లతో ఆడాలి. టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అంటే ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడుతుంది. చివరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు సెమీస్లో తలపడతాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. పాక్తో మ్యాచ్ రద్దు చేసుకున్నా తొలి నాలుగు స్థానాల్లో నిలిస్తే ఫర్వాలేదు. అలా కాకుండా మిగతా జట్లతో జరిగిన మ్యాచ్ల్లో భారత్ ఓడితే మాత్రం సెమీస్ చేరుకొనే అవకాశాలు చేజారుతాయి.


Click it and Unblock the Notifications












