ముంబైదే పైచేయి:
లీగులోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబై, చెన్నై. రోహిత్ శర్మ నాలుగుసార్లు తన జట్టును విజేతగా నిలిపితే.. చెన్నైకి ఎంఎస్ ధోనీ మూడుసార్లు ట్రోఫీ అందించాడు. అయితే రెండు జట్ల రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. రోహిత్ సేనదే పైచేయిలా కనిపిస్తోంది. ఐపీఎల్ 2019 సీజన్లో ముంబై, చెన్నై జట్లు నాలుగు సార్లు తలపడగా.. అన్నింటిలోనూ ముంబై ఇండియన్స్ గెలుపొందింది. లీగ్ దశలో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. వాంఖడేలో జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై.. చెన్నై సొంతగడ్డ చెపాక్లోనూ 46 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
ఐదు మ్యాచ్ల్లోనూ చెన్నైకి ఓటమే:
ముంబై, చెన్నై రెండు జట్లు ప్లేఆఫ్కి చేరగా.. క్వాలిఫయర్-1లో ధోనీ సేనని 6 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్ బృదం ఫైనల్కి చేరింది. ఇక క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటిల్స్ని ఓడించిన చెన్నై ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో ముంబై చేతిలో ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓటమిపాలైంది. ఐపీఎల్ 2019 సీజన్లో చెన్నైపై ముంబై ఆధిపత్యం చెలాయించింది. 2018లో కూడా ఓ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. అంటే ముంబై చేతిలో వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ చెన్నైకి ఓటమే ఎదురైంది. ఇదే ఇప్పుడు ధోనీ సేనలో ఆందళన రేపుతోంది. అయితే ఈసారి టోర్నీ యూఏఈ వేదికగా జరుగుతుండటం చెన్నైకి కాస్త ఉపశమనం కలిగించే ఇషయం. ఎందుకంటే 2014లో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్లో ముంబైతో జరిగిన ఒక మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముంబై 17, చెన్నై 11:
ఐపీఎల్లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందగా.. చెన్నై 11 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకుంది. మొత్తంగా ఐపీఎల్ టోర్నీలో చెన్నైపై ముంబై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక టైటిల్స్లో వేటలోనూ చెన్నై కంటే ముంబై ముందుంది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019లో టోర్నీ విజేతగా నిలవగా.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై 2010, 2011, 2018లో టైటిల్స్ గెలిచింది.
సగటు స్కోరు 140:
అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం ఈ రోజు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. ముంబైకి ఇదే సొంత మైదానం. దుబాయ్ నుంచి చెన్నై అబుదాబికి వస్తోంది. అంటే ఇక్కడి పరిస్థితులేమిటో తెలియకపోవడంతో ధోనీసేనకు ఆడటం సవాలే. పొడిగా ఉండే ఈ పిచ్పై భారీ స్కోర్లేమీ నమోదు కావు. ఏడాదిన్నరగా ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 140. మైదానం పెద్దది కావడంతో సిక్సర్లు బాదే అవకాశం తక్కువ.
జట్ల అంచనా:
చెన్నై: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, ఎంఎస్ ధోనీ (కె, వి), కేదార్ జాదవ్, డ్వేన్బ్రావో, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్.
ముంబై: రోహిత్ శర్మ (కె), క్వింటన్ డికాక్ (వి), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, నేథన్ కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా