భారత్తో జరగనున్న టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ దూరం కానున్నాడు. వెన్ను నొప్పికి గ్రీన్ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని ఆస్ట్రేలియా క్రికెటర్ బోర్డు తెలిపింది. సర్జరీ అనంతరం అతను తిరిగి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టనుంది. ఈ క్రమంలో నవంబర్లో భారత్తో జరిగే అయిదు టెస్టుల సిరీస్, ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి గ్రీన్ దూరం కానున్నాడు.
ఫాస్ట్ బౌలర్లకు వెన్నునొప్పి సాధారణమే అని, అయితే గ్రీన్కు ఫ్రాక్చర్ అయిన ప్రాంతంలో ప్రత్యేకమైన సమస్యతో గాయం తీవ్రత అధికమవుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పేర్కొంది. గ్రీన్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని శస్త్రచికిత్సకు సిద్ధమయ్యాడని తెలిపింది. న్యూజిలాండ్ స్పెషలిస్టులతో సర్జరీ చేయించనున్నామని చెప్పింది.

ఆస్ట్రేలియా తరఫున 25 ఏళ్ల కామెరూన్ గ్రీన్ ఇప్పటివరకు 28 టెస్టులు, 28 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1377 పరుగులు, 35 వికెట్లు తీశాడు. వన్డేల్లో 626 పరుగులు, 20 వికెట్లు, పొట్టి ఫార్మాట్లో 263 పరుగులు, 12 వికెట్లు సాధించాడు. కాగా, బలమైన భారత్తో సిరీస్కు కామెరూన్ గ్రీన్ దూరమవ్వడం ఆస్ట్రేలియాకు ప్రతికూలాంశమే.
కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్గానే బరిలోకి దిగుతోంది.
2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.