హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ప్రధాన కోచ్ పదవి కోసం మొత్తం పది మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఆరుగురికి మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం క్రికెట్ సలహా కమిటీలో సభ్యులుగా ఉన్న లక్ష్మణ్, గంగూలీ బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, ఫిల్ సిమన్స్, లాల్ చంద్ రాజ్పుత్లను సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. మరోవైపు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న సెహ్వాగ్ కూడా ఇంటర్వ్యూ కోసం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చాడు.

అయితే ఈ ఇంటర్వ్యూలు ఎలా నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దరఖాస్తుు చేసుకున్న అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకాలేకపోతే వారిని స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాదు కోచ్ పదవికి ఫేవరెట్లంటూ ఎవరూ లేరని కూడా పేర్కొంది.
మరోవైపు దరఖాస్తుదారుల ప్రతిభ ఆధారంగానే వారిని ఎంపిక చేస్తామని సీఏసీ సభ్యులు తెలిపారు. కాగా, కోచ్ రేసులో రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై సీఏసీ సభ్యులు స్పందించారు. 'ప్రతిభ ఆధారంగానే కోచ్ను ఎన్నుకుంటాం. ఇక్కడ ఫేవరెట్లు అంటూ ఎవరూ లేరు. ఇంటర్వ్యూల అనంతరం బీసీసీఐ పాలకుల కమిటీ కోచ్ ఎవరన్నది ప్రకటిస్తుంది' అని అన్నారు.