
నిరసనల సెగ:
ఐపీఎల్ వచ్చే సీజన్కు సంబంధించి ఈ నెల 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనుంది. అయితే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా ఉన్నాయి. ఐపీఎల్ వేలం ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు కలవరపడ్డాయి.

షెడ్యూల్ ప్రకారమే వేలం:
అయితే ఈనెల 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం షెడ్యూల్ ప్రకారం కోల్కతాలోనే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కోల్కతాలో నెలకొన్న పరిస్థితులపై బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడారు. 'షెడ్యూల్ ప్రకారం గురువారం వేలం జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. కోల్కతాలో అంతగా ప్రభావం కనిపించడం లేదు. ఆయా ఫ్రాంచైజీలు మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం కోల్కతాకు చేరుకుంటాయి' అని తెలిపారు.

332 మంది షార్ట్లిస్ట్:
ఢిల్లీ యాజమాన్యం మంగళవారమే కోల్కతాకు చేరుకోనుంది. మిగతా ఫ్రాంచైజీలు బుధవారం ఉదయం వరకు చేరుకోవచ్చు అని సమాచారం తెలుస్తోంది. వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనడానికి మొత్తం 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది షార్ట్లిస్ట్ అయ్యారు. రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల నుంచి తాము కోరుకుంటున్న 332 మంది ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఫైనలైజ్ చేశాయి.

43 మంది భారత ఆటగాళ్లు:
షార్ట్లిస్ట్ జాబితాలో 43 మంది భారత్కు చెందినవారు కాగా.. మిగతావారు విదేశీ క్రికెటర్లు. 43 మందిలో 19 మంది టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించిన వారు ఉన్నారు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ జాబితా నుంచి గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీంతో కోల్కతా వేదికగా డిసెంబర్ 19న జరగనున్న ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


Click it and Unblock the Notifications












