హైదరాబాద్: రంజీ క్రికెట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ క్రికెటర్ తమ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అందుబాటులో రావడం లేదంటూ అతని పేరు లేకుండా జట్టును ప్రకటించి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఆశ్చర్యపరిచింది.
రంజీ క్రికెట్లో భాగంగా గుజరాత్తో జరిగే వార్మప్ మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన బెంగాల్ జట్టుని క్యాబ్ మంగళవారం ప్రకటించింది. తనను హైదరాబాద్కు తిరిగి ఆడకుండా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అడ్డుకుందనే ఆవేదనతో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అధికారులెవరికీ అందుబాటులో లేకుండా పోయాడు.
దీని ఫలితంగా గుజరాత్తో వార్మప్ మ్యాచ్ల కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. 'ఓజాతో మాట్లాడాలని మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను అందుబాటులోకే రాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓజా పేరు లేకుండానే జట్టును ఎంపిక చేశాం' అని క్యాబ్ సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు.

అసలేం జరిగింది?
గత రెండు రంజీ సీజన్లుగా ప్రజ్ఞాన్ ఓజా రంజీ క్రికెట్లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) తరుపున ఆడుతున్నాడు. అయితే 2017-18 రంజీ సీజన్కు గాను ఓజా తన సొంత టీమ్ అయిన హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ క్యాబ్ను కోరాడు. అయితే తమకు ఓజా అవసరం ఉందంటూ 'క్యాబ్' అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనికి నిరభ్యంతరకర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఓజా రెండు వారాల క్రితమే బెంగాల్ జట్టు ప్రత్యేక శిక్షణా శిబిరం ప్రారంభమైనా... దానికి ఇప్పటి వరకు హాజరు కాలేదు.
బెంగాల్ జట్టు:
Shreevats Goswami (c), Anustup Majumder, Koushik Ghosh, Purab Joshi, Abhishek Raman, Abhishek Mitra, Agniv Pan, Writtick Chatterjee, Aamir Gani, Pradipta Pramanik, Aritra Chatterjee, B Amit, Sayan Ghosh, Ishan Porel, Kanishk Seth, Mukesh Kumar and Sourav Mondal.