
కోల్కతా: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దాంతో బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) హెడ్క్వార్టర్స్ని ఏడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఆదివారం ప్రకటించాడు. క్యాబ్ హెడ్క్వార్టర్స్లో తాత్కాలిక సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్న చందన్ దాస్ ఆరోగ్యం కొన్ని రోజులుగా బాగాలేకపోవడంతో గత శనివారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీంతో వెంటనే క్యాబ్ అప్రమత్తమైంది.
'క్యాబ్ హెడ్క్వార్టర్స్లో చందన్ దాస్ అనే వ్యక్తి సివిల్ ఇంజినీర్గా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. గత వారం రోజుల నుంచి అతను విధులకి రాలేదు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత శనివారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం అతను చార్నాక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వారం నుంచి అతను ఆఫీస్కి రాకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాబ్ ఆఫీస్ని కూడా 7 రోజులు మూసివేసాం. శానిటైజ్ చేయాలని నిర్ణయించాం' అని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఓ ప్రకటనలో తెలిపాడు.
'మేం ప్రభుత్వ నిబంధలను పాటిస్తున్నాం. వాస్తవానికి క్యాబ్ హెడ్క్వార్టర్స్ అధికారికంగా తెరవలేదు. పరిశుభ్రత విభాగం మాత్రమే అప్పుడప్పుడు పనిచేస్తోంది. వారు వచ్చి క్లీనింగ్ చేసి వెళుతున్నారు. అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఓ సమస్య కారణంగా సివిల్ ఇంజినీర్ చందన్ దాస్ వచ్చాడు' అని అవిషేక్ దాల్మియా చెప్పాడు. గత మార్చి నుంచి దేశంలో క్రికెట్ సిరీస్లన్నీ రద్దవగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనల్ని సడలించడంతో స్టేడియాలు ఇప్పుడిపుడే తెరుస్తున్నారు.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్లో కూడా వైరస్ సోకిన వారి సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్లో ఆదివారం వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,97,836కి చేరుకుంది. ఇందులో 19,700 మంది చనిపోయారు. ఇక పశ్చిమ బెంగాల్లో వైరస్ కేసుల సంఖ్య 22,126 ఉండగా.. ఒక్క కోల్కతాలోనే 6,864 నమోదయ్యాయి.