
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్ను భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు విజయంతో ముగించింది. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ మాత్రం పరాజయంతో టోర్నీకి ముగింపు పలికాడు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన సింధు, శ్రీకాంత్ సెమీస్ రేసు నుంచి గురువారమే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఇద్దరూ నామమాత్రపు మ్యాచ్ ఆడారు. శుక్రవారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ మూడో మ్యాచ్లో సింధు ఘన విజయం సాధించింది.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ మహిళల సింగ్స్ గ్రూప్-బి మూడో మ్యాచ్లో పోర్న్పావీ (థాయ్లాండ్)పై పీవీ సింధు 21-18, 21-15తో గెలిచింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను సొంతం చేసుకుంది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు వరుస గేమ్లలో గెలుపొంది టోర్నీని విజయంతో ముగించింది.
గురువారం జరిగిన రెండో మ్యాచ్లో సింధు 19-21, 13-21తో రచనోక్ ఇంతనాన్ (ఇండోనేషియా) చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ 21-19, 12-21, 17-21తో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.
నామమాత్రపు మ్యాచ్లోనైనా గెలిచి విజయంతో టోర్నీని ముగించాలనుకున్న కిదాంబి శ్రీకాంత్కు నిరాశే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్-బి మూడో మ్యాచ్లో లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్) చేతిలో 21-12, 18-21, 19-21తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్.. తర్వాత గేమ్ల్లో ఆ జోరును ప్రదర్శించలేకపోయాడు. దీంతో మూల్యం చెల్లించుకున్నాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలోని రెండో మ్యాచ్లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-9, 21-19తో వాంగ్ జూ వుయ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక తొలి మ్యాచ్లో అండర్స్ ఆంటోన్సెన్ (డెన్ మార్క్) చేతిలో 21-15, 16-21, 18-21తో శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీని శ్రీకాంత్ విజయం లేకుండానే ముగించాడు.