ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రీడలు, వ్యాపారం ఒకటి కాదని సీరియస్ అయ్యాడు. ఆటలో ఏ క్రీడాకారుడికి అయినా ఓ చెడ్డ రోజు ఉంటుందని రాహుల్ అన్నాడు. ఐపీఎల్-2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి అనంతరం తన ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకాతో జరిగిన సంఘటన గురించి రాహుల్ పరోక్షంగా మాట్లాడాడు.
''వ్యాపార రంగం నేపథ్యానికి సంబంధించిన వాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల. వాళ్లు ఎంతో శోధించి జట్టును ఎంపిక చేస్తారు. అయితే దాంతో మీరు ప్రతి మ్యాచ్ గెలస్తారని గ్యారెంటీ ఇవ్వలేం. గణాంకాల పరంగా అత్యుత్తమ ప్లేయర్ కావొచ్చు. కానీ ఆ సదరు ప్లేయర్కు ఓ భయంకర ఏడాది వస్తుంటుంది. క్రీడల్లో ప్రతి ఆటగాడు చెడ్డ రోజును కలిగి ఉంటాడు'' అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.

ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఘోరపరాజయం చవిచూడటంతో అందరి ముందే కేఎల్ రాహుల్ను సంజీవ్ గోయెంకా అవమానించిన సంగతి తెలిసిందే. స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే రాహుల్ ఓటమిపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సంజీవ్ చేసింది ఘోరమైన తప్పిదం అని భారత మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. ఓటమిపై సీరియస్ అవ్వాలంటే రూమ్లో చేయాలి కానీ, పబ్లిక్లో ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయం గురించి కేఎల్ రాహుల్ తాజాగా పరోక్షంగా స్పందించాడు. అయితే తాజా వ్యాఖ్యలతో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్బై చెప్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాహుల్ లక్నోను విడిచి, ఆర్సీబీకి వస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ప్రతి జట్టు గరిష్టంగా నలుగురును మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ మెగా వేలం నిబంధనలపై పూర్తి స్పష్టత మరికొన్ని రోజుల్లో రానుంది.