ఐపీఎల్ 18వ సీజన్ మొదలై రెండు రోజులైపోయింది. మూడు మ్యాచులు కూడా పూర్తయ్యాయి. క్రికెట్ అభిమానులకు మంచి మాజనే ఇచ్చాయి. తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కూడా ఫ్యాన్స్కు మంచి కిక్కే ఇచ్చింది. కానీ ఇదే సమయంలో ఈ మ్యాచ్ వల్ల ఓ బస్ డ్రైవర్ ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఎందుకంటే?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులంతా టీవీలకు ఎలా అయితే అతుక్కుపోతారో.. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అన్న కూడా ఫ్యాన్స్ దాదాపుగా అదే స్థాయిలో ఉత్కంఠతతో పోరును చూస్తుంటారు. అలానే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఓ డ్రైవర్ కూడా అదే పని చేశాడు. కాకపోతే తన వృత్తి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించాడు. అక్కడ ఏమాత్రం కాస్త తేడా జరిగినా ఎంతో మంది ప్రాణాలు ప్రమాదంలోకి వెళ్లిపోయేవి.
ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మార్చి 23న సాయంత్రం ఓ బస్ డ్రైవర్ మ్యాచ్పై ఉన్న ఆసక్తితో ఫోన్లో మ్యాచ్ చూస్తూ వాహనం నడిపాడు. గంటకు 70-80కిలోమీటర్ వేగంతో వాహనాన్ని నడిపాడు. ఫోన్ను స్పీడోమీటర్ మీద పెట్టి.. కామెంటేటరీ సౌండ్ను లౌడ్గా పెట్టుకుని మరీ మ్యాచ్ వీక్షించాడు. అయితే ఆ కామెంటేటరీ విన్న బస్సులోని ప్రయాణికులు కాస్త ఆందోళన చెందారు. తమ ఫోన్ కెమెరాల్లో బస్సు డ్రైవర్ నిర్ణక్ష్యపు డ్రైవింగ్ ను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి కూడా పంపించి ఫిర్యాదు చేశారు.
