Mohammad Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్కు చెందిన లోనావాలాలోని బంగ్లాలో భారీ చోరీ జరిగింది. అంతే కాకుండా దొంగలు బంగ్లాలో కొన్ని విలువైన వస్తువులు చోరీ చేసినట్లు తెలిసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జులై 7 నుంచి 18 మధ్య బంగ్లా ఖాళీగా ఉన్నప్పుడు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు.
పోలీసులు వెల్లడించిన వివరాలు
పుణె పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. దొంగలు బంగ్లా వెనుక గోడకు ఉన్న జాలిని కోసి లోపలికి ప్రవేశించారు. దొంగలు ముందుగా మొదటి అంతస్తులోని గ్యాలరీకి ఎక్కి.. ఆ తర్వాత కిటికీ గ్రిల్ను బలవంతంగా తెరిచి లోపలికి చొరబడ్డారు. ఈ ఘటనలో దొంగలు రూ.50 వేల నగదు, దాదాపు రూ.7వేల విలువైన టీవీని దొంగిలించారు. మొత్తంగా దొంగలు దాదాపు రూ. 57,000 వరకు నష్టం కలిగించారు. అంతే కాకుండా.. దొంగలు ఇంటి లోపల ఉన్న వస్తువులకు కూడా నష్టం కలిగించినట్లు తెలుస్తోంది.

మాజీ కెప్టెన్ సన్నిహితుడు ఫిర్యాదు
బంగ్లాలో జరిగిన చోరీపై అజారుద్దీన్కు సన్నిహితుడైన మహ్మద్ ముజీబ్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ముజీబ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాలో ఎవరూ లేని సమయంలో అంటే జులై 7 నుంచి 18 మధ్య చోరీ జరిగింది. లోనావాలా గ్రామీణ పోలీసులు అజ్ఞాత వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్లు 331(3), 331(4), 305(A), 324(4), 324(5) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పోలీసులు నేరస్థులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనితో పాటు చుట్టుపక్కల ప్రజలను కూడా విచారిస్తున్నారు.