హైదరాబాద్: ట్రాఫిక్ అవగాహన కోసం జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నో బాల్ వేసిన ఫోటోని వినియోగించిన సంగతి తెలిసిందే. 'గీత దాటొద్దు.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు' అన్న సందేశాన్ని ఈ ఫొటో ద్వారా ప్రజలకు తెలియజేశారు.
బుమ్రా నోబాల్ వేసిన చిత్రాన్ని పాకిస్థాన్లోని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ పట్టణ కూడళ్లలో ఏర్పాటు చేశారంటూ అటు జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్తో జరిగిన మ్యాచ్లో బూమ్రా వేసిన నోబాల్ ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన విషయం తెలిసిందే.
తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్కు దిగిన పాక్ను ఒత్తిడిలోకి నెట్టే సువర్ణావకాశం ఆరంభంలోనే చేజారింది. పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ మూడు పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్లో అతడిచ్చిన క్యాచ్ను కీపర్ ధోనీ ఒడిసి పట్టినా అది నోబాల్ కావడంతో జమాన్కు లైఫ్ లభించింది.

3 పరుగుల వద్ద తనకు అందివచ్చిన లైఫ్ని సద్వినియోగం చేసుకున్న ఫకార్ జమాన్ ఆ తర్వాత 114 పరుగులతో వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతేకాదు భారత్పై పాక్ 180 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే బుమ్రా ఇచ్చిన లైఫే పాకిస్థాన్ విజయానికి దోహదపడిందని, దీంతోనే పాకిస్థాన్లోని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ పట్టణ కూడళ్లలో ఈ ఫోటోని ఏర్పాటు చేశారంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. బుమ్రా నో బాల్ ఫోటోని కేవలం జైపూర్లోని ఓ కూడలిలో ఏర్పాటు చేశారు.
ఇదే విషయాన్ని జైపూర్ పోలీస్ శాఖ సైతం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. దీంతో పాటు 'చాలా బాగా చేశారు. దేశం కోసం అత్యుత్తమంగా పోరాడితే మీరిచ్చే గౌరవమేంటో తెలుస్తోంది. పనిలో మీరు చేసే పొరపాట్లను మీలా నేనేం అపహాస్యం చేయను.. ఆందోళన చెందకండి' అని జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖకు బుమ్రా ట్వీట్ చేశాడు.
కాగా, తమ ప్రవర్తనతో పేసర్ బుమ్రా నొచ్చుకున్నాడని తెలుసుకున్న జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ ఈ ఫోటోపై క్షమాపణలు సైతం తెలియజేసింది. 'డియర్ బుమ్రా, నిన్ను బాధించాలని మా ఉద్దేశం కాదు. నీ సెంటిమెంట్లను, లక్షలాది క్రికెట్ అభిమానుల సెంటిమెంట్లను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో మేము అలా చేయలేదు' అని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. అంతేకాదు బుమ్రాని యూత్ ఐకాన్గా అభివర్ణించిన జైపూర్ పోలీసు శాఖ మా అందరికీ నువ్వు ఆదర్శమని వరుస ట్వీట్లలో పేర్కొంది.