హైదరాబాద్: భారీ అంచనాలతో యోయో టెస్టు అనంతరం ఏరికోరీ జట్టును ఎంచుకుంది బీసీసీఐ.. ఈ క్రమంలో అంతా కుదిరింది అనుకుంటున్న తరుణంలో బుమ్రా దూరమైయ్యాడు. అతని లోటు భారత్పై ప్రభావం చూపనుందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనకి గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమవడం భారత జట్టుకి గట్టి ఎదురుదెబ్బ అని సునీల్ గవాస్కర్ అంటున్నాడు.
మూడు రోజుల క్రితం ఐర్లాండ్తో ముగిసిన టీ20 సిరీస్లో ఫీల్డింగ్ చేస్తూ బుమ్రా గాయపడ్డాడు. దీంతో.. అతని స్థానంలో ఇంగ్లాండ్తో మంగళవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్కి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరొందిన బుమ్రా జట్టులో లేకపోవడంతో భారత బౌలింగ్ కాస్త బలహీనపడిందని గవాస్కర్ వివరించారు. మంగళవారం రాత్రి 10 గంటలకి భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది
'ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి ముందు జట్టు నుంచి గాయంతో బుమ్రా వైదొలగడం టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ. గత కొంతకాలంగా బుమ్రా, భువనేశ్వర్ కుమార్ల ద్వయం చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. మ్యాచ్ ఆరంభ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలోనూ భారత్కి నమ్మదగిన బౌలింగ్ జోడి ఇది. అయితే.. ప్రస్తుత టీ20 జట్టులో ఉన్న ఉమేశ్ యాదవ్ కూడా ఇటీవల ఐపీఎల్ 2018 సీజన్, ఐర్లాండ్తో సిరీస్లో బాగా బౌలింగ్ చేశాడు. ఇక స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్లు మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టడి చేసే బాధ్యతలను తీసుకోగలిగితే ఇంగ్లాండ్ని తక్కువ స్కోరుకే నియంత్రించొచ్చు' అని సునీల్ గవాస్కర్ సూచించారు
అయితే ఏదేమైనా ఇంగ్లాండ్ గడ్డపై మంచి బ్యాటింగ్ లైనప్తో రాణించగలమంటూ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లలో కొంతమందికి పూర్వం ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం ఉందని దానిని చక్కగా వినియోగించుకుంటామని తెలియజేశాడు.