
హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా... ఈ మధ్య కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తోన్న బౌలర్. అయితే అతడు టెస్టు ఫార్మాట్కి మాత్రం ఎంపిక కాలేకపోతున్నాడు. ఈ విషయమైన మాజీ క్రికెటర్లు సైతం బుమ్రాకు మద్దతుగా నిలిచారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న బుమ్రాకి టెస్టు ఛాన్స్ ఇవ్వాలని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్తో పాటు లంకతో టీ20ల కోసం భారత్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో అందరి అంచనాలకు తగ్గట్లుగానే జస్ప్రీత్ బుమ్రా తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది కాలంగా ఫస్ట్క్లాస్ క్రికెట్ కూడా ఆడని 23 ఏళ్ల బుమ్రా ఎంపిక కొంత మందికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు.
కానీ, సఫారీ పిచ్లపై కచ్చితంగా ప్రభావం చూపుతాడని సెలెక్టర్లు బుమ్రాకి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ పేసర్లు ఉండాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంతో పాటు కచ్చితమైన యార్కర్లను సంధించడంలో బుమ్రా దిట్ట అనే విషయం తెలిసిందే.
బుమ్రా 28 వన్డేల్లో 52 వికెట్లు, 30 టి20ల్లో 40 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 5 నుంచి జరిగే ఈ టూర్ కోసం మొత్తం 17 మందిని ఎంపిక చేశారు. టెస్టు సిరిస్కు బుమ్రాతో పాటుగా బ్యాకప్ వికెట్ కీపర్గా పార్థివ్ పటేల్కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. డిసెంబర్ 2016లో పార్దీవ్ పటేల్ చివరిసారిగా భారత్ తరుపున టెస్టు మ్యాచ్ ఆడాడు.
మరోవైపు లంకతో టెస్టు సిరీస్కు దూరంగా ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని 17 మంది సభ్యుల టెస్టు జట్టులో ఏడుగురు బ్యాట్స్మెన్, ఏడుగురు బౌలర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఒక ఆల్రౌండర్ ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు రహానే వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు జట్టు:
కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), ధావన్, మురళీ విజయ్, రాహుల్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, పార్థివ్ పటేల్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, భువ నేశ్వర్, షమీ, ఇషాంత్, ఉమేశ్, జస్ప్రీత్ బుమ్రా.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.