
బ్రిస్బేన్: గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతోంది. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ చెలరేగడంతో.. ఆసీస్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో మరో వికెట్ కోల్పోకుండా కంగారు జట్టు జాగ్రత్తగా ఆడుతోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (28), కామెరూన్ గ్రీన్ (4) నిలకడగా ఆడుతున్నారు. భారత్ కంటే ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మార్కస్ హ్యారిస్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. నాలుగో రోజు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్కు చేర్చారు.
26వ ఓవర్లో మార్కస్ హ్యారిస్ (38)ను శార్దూల్ ఠాకుర్ ఔట్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన హ్యారిస్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్.. అర్ధ శతకానికి చేరువవుతున్న డేవిడ్ వార్నర్ (48)ను బోల్తా కొట్టించాడు. చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వార్నర్ సమీక్షకు వెళ్లినా.. ఔట్ అనే తేలింది. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద వార్నర్ పెవిలియన్ చేరాడు.
మొహ్మద్ సిరాజ్ 31వ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 31వ ఓవర్ రెండో బంతికి మార్నస్ లబుషేన్ (25)ను ఔట్ చేయగా.. అదే ఓవర్ చివరి బంతికి మాథ్యూ వేడ్ను డకౌట్ చేశాడు. లబుషేన్ క్యాచును రోహిత్ శర్మ, వేడ్ క్యాచును వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుకున్నారు. దీంతో ఆసీస్ 123 వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆపై స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ ఇద్దరూ ఆచితూచి ఆడారు. ప్రస్తుతం ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది.