
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా అర్ధ శతకం చేశాడు. మార్నస్ లబుషేన్ వేసిన 74వ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన పుజారా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 196 బంతుల్లో నయావాల్ అర్ధ శతకం చేశాడు. ఈ సిరీస్ అతనిది మూడో హాఫ్ సెంచరీ. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పుతూ టీమిండియాను విజయం దిశగా తీసుకెళ్లాడు.
నయావాల్ ఛెతేశ్వర్ పుజారా 196 బంతుల్లో అర్ధ శతకం చేయడంతో ఓ చెత్త రికార్డు నెలకొల్పాడు. తన టెస్ట్ కెరీర్లోనే నెమ్మదైన హాఫ్ సెంచరీ చేశాడు. బ్రిస్బేన్లో జరుగుతున్న టెస్టులో 196 బంతుల్లో అర్ధ శతకం చేయగా.. సిడ్నీ టెస్టు (మొదటి ఇన్నింగ్స్)లో 174 బంతుల్లో చేశాడు. అదే సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 170 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో 173 బంతుల్లో అర్ధ శతకం చేశాడు.
ఈ టెస్ట్ ద్వారా ఛెతేశ్వర్ పుజారా ఓ అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. బ్రిస్బేన్ మ్యాచ్ ద్వారా ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్పై పుజారా 500 టెస్ట్ పరుగులు చేశాడు. గత ఇరవై సంవత్సరాలలో టెస్టుల్లో ఒక బౌలర్పై 500లకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా నయావాల్ నిలిచాడు. ఇంతకుముందు పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సయీద్ అజ్మల్పై లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 500లకు పైగా పరుగులు చేశాడు. లియోన్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 410 రన్స్ బాదాడు. ఏబీ (342), రహానే (331), రూట్ (322) పరుగులు చేశారు.
చివరకు ఛేతేశ్వర్ పుజారా (56) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 228 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. విజయానికి ఇంకా 96 పరుగుల దూరంలో ఉంది. 82 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 232/4గా నమోదైంది. ఇదే సమయంలో మైదానంలో చిరు జల్లులు కురుస్తుండడంతో ఆట కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆట మళ్లీ కొనసాగింది. పంత్ (34), మయాంక్ అగర్వాల్(4) క్రీజులో ఉన్నారు.