గ్రేటర్ నోయిడా: ఫాం లేమి, దురుసు తనం కారణంగా టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ గత కాలంగా జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గంభీర్.. దేశవాళీ క్రికెట్ లీగ్ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. కాగా, ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. ఇండియా బ్లూ జట్టుకు గంభీర్ సారథ్యం వహిస్తుండగా, మరో జట్టు ఇండియా రెడ్కు యువరాజ్ సింగ్ కెప్టెన్గా ఉన్నాడు.
మ్యాచ్ ప్రారంభమైన శనివారం రోజున గంభీర్ 94 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆదివారం కొంత మంది అమ్మాయిలు తమ అభిమాన క్రికెటర్ గంభీర్ కోసం ఎర్రటి ఎండలో సంఘీభావం తెలిపారు. 'గంభీర్ను తిరిగి భారత్ జట్టులోకి తీసుకోండి' అని రాసి ఉన్న 20 అడుగుల బ్యానర్ను వారు ప్రదర్శించారు.
ఈ విషయాన్ని గమనించిన గంభీర్ ఏసీయూ నిబంధనల ప్రకారం తెలియని వ్యక్తులతో మాట్లాడటానికి వీలు లేకపోవడంతో వెంటనే వారికి మంచినీళ్ల బాటిళ్లను అందజేయాలని స్టేడియం సిబ్బందికి సూచించాడు. దులీప్ ట్రోఫీలో ఇన్నింగ్స్ 80 సగటుతో అత్యధికంగా 320 పరుగులు చేశాడు గంభీర్.

కాగా, ఈ టీనేజ్ అమ్మాయిలు శివాజీ, కమలా నెహ్రు కాలేజ్లో విద్యనభ్యసిస్తున్నారు. 'మేము గంభీర్ ఫ్యాన్ క్లబ్ను నడిపిస్తున్నాం. అతను టీమిండియాలోకి రావాలని కోరుకుంటున్నాం. అతడు మళ్లీ రాణించగలడు' అని అస్మిత అనే అమ్మాయి తెలిపింది.
గంభీర్ తనకు కానుక ఇచ్చిన కెకెఆర్ జెర్సీని వేసుకుని వచ్చిందా అమ్మాయి. తాము గంభీర్ ఇంటికి వెళ్లామని, అతనికి మద్దతుగా ఉంటామని చెప్పింది శివాజీ కాలేజీకి చెందిన మరో అమ్మాయి.
ప్రస్తుతం రంజీల్లోనూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ చెప్పుకోదగ్గ విధంగానే ప్రదర్శన ఇస్తున్నప్పటికీ.. టీమిండియాలో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన నేపథ్యంలో గంభీర్కు అవకాశం కష్ట సాధ్యంగానే మారింది.
అయితే, గతంలో కొన్ని అవకాశాలు వచ్చినా.. సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడంతో టీమిండియాకు దూరమైన గంభీర్.. రంజీల్లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.