IPL 2026: ఐపీఎల్ అంటేనే అద్భుతాలకు వేదికగా నిలుస్తుంది. ఈ వేదిక నుంచి రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన బ్రిజేష్ శర్మ అలాంటి ఓ సంచలనానికి తెరలేపాడు. చెన్నై సూపర్ కింగ్స్ వంటి దిగ్గజ జట్టుతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుతమైన బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అసలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన అనుభవం లేకుండానే నేరుగా ఐపీఎల్ మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటాడు.
అంచనాలు పెంచిన అరంగేట్రం
గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. ఈ అన్-క్యాప్డ్ ప్లేయర్ పై నమ్మకం ఉంచి బంతిని బ్రిజేష్ శర్మకు అందించాడు. బ్రిజేష్ శర్మ ఏ మాత్రం తడబడకుండా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. కేవలం 3 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ కీలక వికెట్ను పడగొట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్తో ఉన్న సీనియర్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ ప్రదర్శనతో మొదటి మ్యాచ్లోనే సెలెక్టర్ల మనసు గెలుచుకున్నాడు.

ఇంతకు ఎవరీ బ్రిజేష్ శర్మ?
బ్రిజేష్ శర్మ జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు. బ్రిజేష్ కుటుంబ నేపథ్యం చాలా సామాన్యమైనది. బ్రిజేష్ శర్మ తండ్రి ఓ సాధారణ కూలీ. కొడుకును ఎలాగైనా గొప్ప క్రికెటర్గా చూడాలనే ఆశయంతో ఆయన పడ్డ కష్టం వర్ణనాతీతం. కుటుంబంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. బ్రిజేష్ తన క్రికెట్ కలను వదులుకోలేదు. ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ బ్రిజేష్ శర్మను రూ.30 లక్షల బేస్ ధరకు దక్కించుకోవడం అతని జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది.
బ్రిజేష్ కెరీర్ను మార్చిన టోర్నమెంట్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జట్టు నుంచి కొన్ని కారణాల వల్ల తొలగించబడిన తర్వాత బ్రిజేష్ శర్మ డీలా పడలేదు. మెరుగైన అవకాశాల కోసం బెంగాల్కు వలస వెళ్లాడు. అక్కడ జరిగిన బెంగాల్ ప్రో టీ20 లీగ్ (2025)లో 'మాల్డా స్మాషర్స్' జట్టు తరపున ఆడాడు. ఆ టోర్నమెంట్లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 11 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక్కడే రాజస్థాన్ రాయల్స్ స్కౌట్ల కంటపడ్డాడు. వారు బ్రిజేష్ శర్మ వేగాన్ని, నైపుణ్యాన్ని గుర్తించి వేలంలో కొనుగోలు చేశారు.
ఎన్నో ఎదురుదెబ్బలకు ఓర్చి..
బ్రిజేష్ శర్మ ప్రయాణంలో ఎదురుదెబ్బలు ఎన్నో ఉన్నాయి. ఢిల్లీలోని యూనిక్ స్పోర్ట్స్ క్లబ్లో కోచ్ దీపక్ పునియా వద్ద శిక్షణ పొందడం బ్రిజేష్ శర్మకు క్రమశిక్షణను నేర్పింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన ప్రతిసారీ స్నేహితులు,కుటుంబం అతడికి అండగా నిలిచారు. "నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నా తండ్రి కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. నా మీద నాకంటే నా స్నేహితులకే ఎక్కువ నమ్మకం ఉండేది" అని బ్రిజేష్ తన సక్సెస్ క్రెడిట్ను వారికి అంకితం చేశాడు.
ఐపీఎల్ కల నిజమైన వేళ..
వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం బాది బ్యాటింగ్లో మెరిస్తే, బ్రిజేష్ శర్మ తన బౌలింగ్తో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కూలీ కొడుకుగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, నేడు కోట్లాది మంది వీక్షించే ఐపీఎల్ వేదికపై ఓ స్టార్గా ఎదగడం నిజంగా ఓ సినిమా కథను తలపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎంతటి కష్టనష్టాలనైనా దాటి విజయం సాధించవచ్చని బ్రిజేష్ శర్మ నిరూపించాడు.